BCCI Fitness Test: శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా స్టార్ క్రికెటర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బెంగళూరుకు పిలిపించింది. వచ్చే సుదీర్ఘ క్రికెట్ సీజన్కు ఆటగాళ్లను సిద్ధం చేయడంలో భాగంగా శనివారం (ఆగస్ట్ 29) బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పలువురు కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఫిట్నెస్ పరీక్షలకు హాజరయ్యారు. రెండు టెస్టుల సిరీస్లో మూడు రోజుల పాటు మైదానంలో శ్రమించిన ఆటగాళ్లు 48 గంటలు పూర్తవకముందే ప్రీ-సీజన్ ఫిట్నెస్ ప్రమాణాలను పూర్తి చేయడం విశేషం. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్కీపర్ రిషభ్ పంత్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా టీ20 స్పెషలిస్టులు రింకూ సింగ్, సంజూ శాంసన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా పలువురు ఆటగాళ్లు ఈ ఫిట్నెస్ పరీక్షల్లో పాల్గొన్నారు.
ఏయే ఫిట్నెస్ పరీక్షలు?:
బీసీసీఐ నిర్వహిస్తున్న తప్పనిసరి ఫిట్నెస్ పరీక్షల్లో బ్రోంకో టెస్ట్, 2కే రన్, యోయో టెస్ట్తో పాటు క్రికెట్కు సంబంధించిన ప్రత్యేక డ్రిల్స్ ఉంటాయి. ముఖ్యంగా వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే సామర్థ్యాన్ని పరీక్షించే డ్రిల్స్కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్రోంకో టెస్టులో 0 మీటర్లు, 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల వద్ద కోన్లు ఏర్పాటు చేస్తారు. ఆటగాళ్లు 0 నుంచి 20 మీటర్ల వరకు వెళ్లి తిరిగి రావాలి. అదే విధంగా 40, 60 మీటర్ల దూరాలను కూడా విరామం లేకుండా పూర్తి చేయాలి. ఇలా మొత్తం ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో సుమారు 1200 మీటర్ల దూరాన్ని ఐదున్నర నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. యోయో టెస్టులో చాలాకాలంగా 16.5 స్థాయి ప్రమాణంగా ఉంది. అలాగే 2కే రన్ అంటే 2000 మీటర్ల పరుగును 10 నిమిషాల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా ఆటగాళ్ల స్టామినా, వేగం వంటి అంశాలను బీసీసీఐ అంచనా వేయనుంది.
గాయపడిన స్టార్లకు మినహాయింపు:
ప్రస్తుతం రిహాబిలిటేషన్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఫిట్గా ఉన్నట్లు వైద్య బృందం ప్రకటించిన తర్వాతే ఈ ఫిట్నెస్ డ్రిల్స్లో పాల్గొంటారు. మరోవైపు శ్రీలంకతో వరుసగా రెండు టెస్టుల్లో బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు ప్రస్తుతానికి ఫిట్నెస్ పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇంగ్లండ్ పర్యటనలో హ్యామ్స్ట్రింగ్ సమస్యకు గురైన ప్రిన్స్ యాదవ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. దీంతో జాతీయ జట్టులో చోటు కోసం అతడికి మరోసారి అవకాశం దక్కే అవకాశం ఉంది.
సెప్టెంబర్ నుంచి బిజీ షెడ్యూల్:
ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి బీసీసీఐ హోమ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈసారి భారత్లోనే ఆఫ్ఘనిస్థాన్తో మూడు టీ20ల సిరీస్తో సీజన్ మొదలుకానుంది. న్యూఢిల్లీలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత భారత టీ20 జట్టులోని పలువురు కీలక ఆటగాళ్లు ఆసియా క్రీడల కోసం జపాన్కు వెళ్లనున్నారు. అదే సమయంలో మరో జట్టు వెస్టిండీస్తో స్వదేశంలో సిరీస్లో పాల్గొననుంది. దీనితో పాటు సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ రెండో వారం వరకు పుదుచ్చేరిలో భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య సిరీస్ కూడా జరగనుంది. వచ్చే ఎనిమిది నెలల పాటు టీమిండియా ఆటగాళ్లకు అత్యంత బిజీ షెడ్యూల్ ఉండనుంది. ఈ సుదీర్ఘ వ్యవధి 2027 ఐపీఎల్ వరకు కొనసాగనున్న నేపథ్యంలో.. ఆటగాళ్ల ఫిట్నెస్ను ముందుగానే పరిశీలించి అవసరమైన చోట వర్క్లోడ్ మేనేజ్మెంట్ చేయడంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

