న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్లో టీమిండియా కల చెదిరింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు వైఫల్యం చెందారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 277/7 స్కోర్ చేశారు. స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53), మిథాలీ రాజ్ (68), హర్మన్ప్రీత్ కౌర్ (48) రాణించారు.
అనంతరం భారత్ నిర్దేశించిన 278 పరుగుల టార్గెట్ను ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా ఛేదించింది. చివరి ఓవర్లో ఏడు పరుగులు అవసరం కాగా మ్యాచ్ ఉత్కంఠగా మారింది. తొలి బంతికి ఒక పరుగు రాగా.. రెండో బంతికి దక్షిణాఫ్రికా వికెట్ పడింది. ఆఖరి రెండు బంతుల్లో 3 పరుగులు కావాల్సిన దశలో దీప్తి శర్మ నోబాల్ వేసింది. అనంతరం రెండు బంతులకు రెండు పరుగులు రావడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో రాణించిన డుప్రీజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.
