NTV Telugu Site icon

Virat Kohli-ICC: ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ!

Virat Kohli Icc Award

Virat Kohli Icc Award

Virat Kohli with ICC ODI Player Of The Year Award: టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవార్డు అందుకున్నాడు. ‘ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ఆదివారం న్యూయార్క్‌లో అందుకున్నాడు. అంతేకాదు ‘ఐసీసీ మెన్స్‌ వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ 2023 క్యాప్‌ను కూడా విరాట్ స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. 2012, 2017, 2018లో కూడా విరాట్ ఈ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 అనంతరం కుటుంబంతో గడిపిన విరాట్.. టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం శనివారం న్యూయార్క్‌ చేరుకున్నాడు.

2023లో విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 35 ఏళ్ల విరాట్ గతేడాది 27 వన్డేలు ఆడి.. 1377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 166 నాటౌట్. ఆసియా కప్‌ 2023లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చేసిన సెంచరీ (122 నాటౌట్‌) హైలైట్‌గా నిలిపోయింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో 11 మ్యాచ్‌లలో 765 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలవడమే కాకుండా.. ప్రపంచకప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

Also Read: USA vs CAN: కెనడాపై సంచలన విజయం.. టీ20 ప్రపంచకప్‌లో అమెరికా బోణీ!

టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం విరాట్ కోహ్లీ అమెరికా చేరుకున్నాడు. శనివారమే న్యూయార్క్‌ చేరుకున్న విరాట్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడి పరిస్థితులు, కాలానికి అలవాటు పడేందుకు కొంచెం టైమ్ పడుతుంది. అందుకే శనివారం (జూన్‌ 1) బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. జూన్‌ 5న ఐర్లాండ్‌తో భారత్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ బరిలోకి దిగనున్నాడు.