ప్రతిష్టాత్మక ‘టైమ్ మ్యాగజైన్’ 2026 సంవత్సరానికి గాను క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో భారత పురుషుల క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ లేదా ప్రస్తుత కెప్టెన్ గిల్లకు చోటు దక్కలేదు. అయితే.. భారతదేశం నుండి ఏకైక ప్రతినిధిగా భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ అయిన స్మృతి మంధాన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది.
అరుదైన రికార్డుల స్మృతి..
29 ఏళ్ల స్మృతి మంధాన ప్రస్తుతం మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడుతోంది. ఆమె కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక అర్థశతకాలు (34) చేసిన రికార్డు ఆమె పేరిట ఉంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (4,401) చేసిన రెండో క్రికెటర్గా, వన్డేల్లో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. దేశీయ వన్డే మ్యాచ్ల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్ మంధాన కావడం విశేషం. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. ఆమె మొత్తం 17 అంతర్జాతీయ సెంచరీలు సాధించింది.
టైమ్ మ్యాగజైన్ ప్రశంసలు..
స్మృతి మంధాన నాయకత్వ ప్రతిభను కూడా టైమ్ మ్యాగజైన్ కొనియాడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ 2024, 2026 లలో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిళ్లను ఆమె గెలిపించింది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు ఆమె వైస్ కెప్టెన్గా సేవలు అందించింది. 2025 వన్డే వరల్డ్ కప్లో 9 మ్యాచ్ల్లో 434 పరుగులు చేసి, ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్గా మితాలీ రాజ్ (409 పరుగులు) రికార్డును బద్దలు కొట్టింది.
ప్రపంచ దిగ్గజాల సరసన..
ఈ టైమ్ 100 జాబితాలో స్మృతి మంధానతో పాటు ఫుట్బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, బాస్కెట్బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్, టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ టెంబా బావుమా వంటి ప్రపంచ స్థాయి క్రీడా ప్రముఖులు ఉన్నారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మంధాన ఇప్పటికే రెండుసార్లు ఐసీసీ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఆమె ఇప్పటివరకు 167 టీ20లు, 120 వన్డేలు, 8 టెస్ట్ మ్యాచ్లు ఆడింది.

