US Open 2022: యూఎస్ ఓపెన్లో ఓటమితో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికింది. మహిళల సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టొమ్లానోవిక్తో ఓటమి పాలైన అమెరికన్ టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ శుక్రవారం క్రీడకు వీడ్కోలు పలికింది. సెరెనాపై అజ్లా 7-5, 7-5, 6-7, 6-1 తేడాతో విజయం సాధించింది. ఓటమి అనంతరం కన్నీరు పెట్టుకున్న సెరెనా ఇది తన జీవితంలో అపురూపమైన ప్రయాణమని తెలిపింది. తనను ప్రోత్సహించిన వారందరికీ సెరెనా కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఇప్పటివరకు 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించింది.
Gold Rate Today: దిగివస్తున్న పుత్తిడి ధర.. ఇవాళ ఎంత తగ్గిందంటే..?
యూఎస్ ఓపెన్ తర్వాత ఆటకు వీడ్కోలు చెబుతానని ఇదివరకే సెరెనా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేసే అవకాశం ఏమైనా ఉందా..? అన్న ప్రశ్నకు ‘మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు’ అని సమాధానం ఇచ్చింది. దీంతో సెరెనా ఆటకు వీడ్కోలు పలకడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. టెన్నిస్లో ఉన్నత శిఖరాలకు చేరడం వెనుక తన సోదరి వీనస్ విలియమ్స్ కీలక పాత్ర పోషించిందని సెరెనా విలియమ్స్ వివరించింది. ‘‘వీనస్ లేకపోతే ఇక్కడ సెరెనా ఉండేది కాదు. అందుకే వీనస్కు ధన్యవాదాలు చెబుతున్నా. టెన్నిస్లో ఉన్నత స్థాయికి రావడానికి కారణం వీనస్. ఇదంతా నా తల్లిదండ్రుల వల్లే.. ప్రతి దానికి వారే అర్హులు. అందుకోసం కృతజ్ఞతాభావంతో ఉంటా. నా కంట్లో నుంచి వచ్చే నీళ్లు ఆనందభాష్పాలు అనుకుంటున్నా’’ అని సెరెనా విలియమ్స్ పేర్కొంది.