ఐపీఎల్లో భాగంగా శనివారం జరిగిన రెండు మ్యాచ్లలోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లనే విజయం వరించింది. తొలి మ్యాచ్లో టార్గెట్ ఛేదించడంలో ముంబై ఇండియన్స్ చతికిలపడగా.. రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బొక్కా బోర్లా పడింది. ఓ దశలో వార్నర్ (66) పోరాటంతో గెలిచేలా కనిపించిన ఢిల్లీ చేతులారా వికెట్లు కోల్పోయి పరాజయాన్ని కొనితెచ్చుకుంది.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ (55), దినేష్ కార్తీక్ (66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. షాబాజ్ అహ్మద్ (32) దినేష్ కార్తీక్కు సహకారం అందించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ (66), రిషబ్ పంత్ (34) పరుగులతో రాణించినా మిగిలిన ఆటగాళ్లు తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో నిర్ణీత ఓవర్లలో 173/7 పరుగులకే ఢిల్లీ జట్టు పరిమితమైంది. బెంగళూరు బౌలర్లలో హేజిల్ వుడ్ 3 వికెట్లు సాధించగా.. సిరాజ్ 2, హసరంగా ఓ వికెట్ తీశారు. ఈ టోర్నీలో బెంగళూరు జట్టుకు ఇది నాలుగో విజయం. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీ జట్టు రెండు విజయాలు, మూడు పరాజయాలతో 8వ స్థానంలో ఉంది.
