Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!

  • టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు
  • లార్డ్స్‌లో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌
  • సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు
Rohit Sharma Lord's Odi History

Rohit Sharma Lord's Odi History

Rohit Sharma First Indian ODI century at Lord’s: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో సూపర్ సెంచరీతో హిట్‌మ్యాన్ ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతుల్లో 138 పరుగులు చేశాడు. 50 ఏళ్ల లార్డ్స్‌ చరిత్రలో ఓ టీమిండియా బ్యాటర్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు.

53 ఏళ్లు గడిచినా:

1972లో లార్డ్స్‌లో తొలి వన్డే జరిగింది. ఇప్పటివరకు 53 ఏళ్లు గడిచినా.. ఏ టీమిండియా బ్యాటర్ కూడా లార్డ్స్‌లో శతకం బాధలేదు. ఎందరో దిగ్గజ భారత బ్యాటర్లు ఈ మైదానంలో ఆడినా.. ఇప్పటివరకు ఎవరూ వన్డేల్లో సెంచరీ చేయలేకపోయారు. ఆ లోటును ఇప్పుడు రోహిత్ శర్మ తీర్చాడు. ఇప్పటి వరకు లార్డ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. 2004లో ఇంగ్లండ్‌పై దాదా 119 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఇప్పుడు హిట్‌మ్యాన్ 138 పరుగులతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో గంగూలీ రెండో స్థానానికి పడిపోయాడు.

మహ్మద్ కైఫ్ అజేయ ఇన్నింగ్స్:

లార్డ్స్‌లో భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఇన్నింగ్స్‌లలో మహ్మద్ కైఫ్ అజేయ 87 పరుగుల ఇన్నింగ్స్ ముందువరుసలో ఉంటుంది. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్ నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదించడంలో కైఫ్ కీలక పాత్ర పోషించాడు. ఆ చారిత్రాత్మక విజయానికి కైఫ్ ఇన్నింగ్స్ ప్రధాన కారణంగా నిలిచింది. లార్డ్స్‌లో భారత బ్యాటర్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో రోహిత్ శర్మ (138) అగ్రస్థానంలో ఉండగా.. సౌరవ్ గంగూలీ (90), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్), సురేష్ రైనా (84), ఎంఎస్ ధోనీ (78 నాటౌట్), రాహుల్ ద్రవిడ్ (73 నాటౌట్), వీరేంద్ర సెహ్వాగ్ (71), యువరాజ్ సింగ్ (69), మొహిందర్ అమర్నాథ్ (58), సచిన్ టెండూల్కర్ (52), రాహుల్ ద్రవిడ్ (52) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అత్యధిక వయసులో సెంచరీ:

ఈ శతకంతో రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక వయసులో (39 ఏళ్ల 80 రోజులు) శతకం సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. లార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ఈ ఘనత సాధించడం అతని ఇన్నింగ్స్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇంతకుముందు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (38 ఏళ్ల 327 రోజులు) పేరిట ఉండేది.

మొత్తం 34 వన్డే శతకాలు:

లార్డ్స్‌లో ఇప్పటివరకు మొత్తం 34 వన్డే శతకాలు నమోదయ్యాయి. అక్కడ ఇంగ్లండ్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోతిక్ ఒక్కడే మూడు సెంచరీలు బాదాడు. 1975లో భారత జట్టుపై డెన్నిస్ ఎమ్మిస్ చేసిన 137 పరుగులు లార్డ్స్‌లో నమోదైన తొలి వన్డే శతకం కాగా.. 1979 ప్రపంచ కప్ ఫైనల్లో వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అజేయంగా చేసిన 138 పరుగులు ఈ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజాగా బెన్ బకెట్ 141 పరుగులతో రిచర్డ్స్ రికార్డు బద్దలు కొట్టాడు. అలాగే కుమార సంగక్కర, రికీ పాంటింగ్, క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్, ఇమామ్ ఉల్ హక్ వంటి ప్రపంచ దిగ్గజాలు కూడా లార్డ్స్‌లో వన్డే శతకాలు సాధించారు.