Virat Kohli: హోటల్ రూంలో ప్రైవసీకి భంగం.. కోహ్లీకి పెర్త్ హోటల్ క్షమాపణలు

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు ఆదివారం నాడు పెర్త్‌లో బస చేసింది. అయితే అక్కడి హోటల్‌ గదిలో కోహ్లీ లేని సమయంలో ఓ వ్యక్తి వెళ్లి గదిలోని వస్తువులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కలకలం రేపింది. కోహ్లీ ధరించే దుస్తులు, కళ్లద్దాలు, టోపీలు, బూట్లు, ఇతర వస్తువులను ఈ వీడియోలో చూపించాడు. అయితే ఈ వీడియోపై స్పందించిన విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విరాట్ కోహ్లీకి క్రౌన్ పెర్త్ హోటల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. కోహ్లీ ఉంటున్న రూమ్‌ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని విధుల్లోని తొలగించింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించామని, భారత క్రికెట్ బోర్డు, ఐసీసీలతో తాము సహకరిస్తామని హోటల్ యాజమాన్యం తెలిపింది. ఈ సంఘటనపై ఐసీసీ కూడా క్షమాపణలు తెలిపింది.

Read Also: Team India: రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ

×
×
Ad

కాగా తాను లేని సమయంలో తన గదిలోని వస్తువులను వీడియో తీసి సోషల్ మీడియాలో లీక్ చేయడం పట్ల విరాట్ కోహ్లీ మండిపడ్డాడు. తమ ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిమాన ఆటగాళ్లను చూడటం వల్ల, కలవడం వల్ల ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఫీల్‌ అవుతారని తెలుసు అని.. కానీ ప్రస్తుతం సర్కులేట్ అవుతున్న వీడియోను చూస్తే చాలా బాధకలుగుతోందని కోహ్లీ తెలిపాడు. తన హోటల్ గదిలోనే తనకు ప్రైవసీ లేకపోతే తనకు మరెక్కడ సురక్షితమైన చోటు లభిస్తుందని ప్రశ్నించాడు. ఇటువంటి ఉన్మాద పూర్తి చర్యలను సహించలేనని కోహ్లీ స్పష్టం చేశాడు. దయచేసి తమ ప్రైవసీని అర్ధం చేసుకుని తమను ఓ వస్తువులా భావించరాదని విజ్ఞప్తి చేశాడు.