నాటింగ్హమ్ టెస్ట్.. చివరి రోజు కీలకంగా మారింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. గెలవాంటే ఇంకా 157 పరుగులు చేయాలి..! అటు ఇంగ్లండ్ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి..! దీంతో గెలుపు కోసం రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
అంతకుముందు ఇంగ్లండ్ టీమ్ 303 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జో రూట్ సెంచరీ చేశాడు. 109 పరుగులు చేసి అవుటయ్యాడు. టెస్ట్ కెరీర్లో రూట్కి ఇది 21వ సెంచరీ. రూట్కి మిగిలిన బ్యాట్స్మెన్ సహకరించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైన చేయగలిగింది. రూట్తో పాటు కర్రన్ 32 పరుగులు, బెయిర్స్టో 30 పరుగులు చేశారు. ఇక టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బూమ్రాకు ఐదు వికెట్లు తీశాడు. సిరాజ్, శార్దూల్లకు చెరో రెండు వికెట్లు తీశారు.
ఈ టెస్ట్.. రెండు, మూడు రోజులలో వర్షం కారణంగా అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. నాలుగో రోజు మాత్రం వరణుడు తెరిపినిచ్చాడు. చివరిరోజైన ఈరోజు.. వర్షం పడకుంటే మ్యాచ్ ఫలితం తేలుతుంది. లేక వర్షార్పణం అయితే మాత్రం డ్రా గా ముగిసే అవకాశం ఉంది. చేతిలో వికెట్లు ఉన్నందున భారత్కే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే చివరిరోజు పిచ్ బ్యాట్స్మెన్కు సహకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లీష్ బౌలర్లను తక్కువగా అంచనావేయడానికి లేదు. అండర్సన్ తాజాగా కుంబ్లే రికార్డ్ను అధిగమించి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఒక రోజు ఉండటం .. చేయాల్సిన స్కోర్ పెద్దగా లేకపోవడంతో ఇప్పటివరకు ఆధిపత్యం చెలాయించిన భారత్.. చివరి రోజు సత్తా చూపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
