అన్ని విషయాల్లో పురుషులు, మహిళలు సమానమే అని చెప్తుంటారు. కానీ పాటించరు. ఉదాహరణకు క్రికెట్ విషయానికి వస్తే పురుషులకు ఒకలా.. మహిళలకు మరోలా వేతనాలు ఇస్తున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అన్ని జట్లు పురుషులు జట్టుకు, మహిళల జట్టుకు సమానంగా వేతనాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే క్రికెట్లో పురుషుల క్రికెట్కు ఉన్నంత ఆదరణ మహిళల క్రికెట్కు లేదనేది జగమెరిగిన సత్యం. అయితే గతంలో కంటే మహిళల క్రికెట్కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అందుకే ఐపీఎల్ లాంటి టోర్నీని మహిళల కోసం బీసీసీఐ ప్రత్యేకంగా నిర్వహిస్తోంది.
Read Also: IND Vs ENG: ఐదో టెస్టులో భారత్ ఓటమి.. టెస్ట్ సిరీస్ సమం
కానీ చాలాకాలంగా తమకు కూడా పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని మహిళా క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా వాళ్లకు మద్దతు పలుకుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆ దిశగా ముందడుగు వేసింది. మహిళలు, పురుషుల క్రికెటర్లకు సమానంగా వేతనం ఇచ్చేందుకు న్యూజిలాండ్ బోర్డు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల ఏళ్ల పాటు ఇరు వర్గాల క్రికెటర్లకు సమాన వేతనం ఇవ్వాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మంగళవారం నాడు ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం అన్ని ఫార్మాట్లు, పోటీలకు వర్తిస్తుంది. దీంతో పురుషుల క్రికెటర్లకు ఎంత వేతనం ఇస్తున్నారో.. మహిళా క్రికెటర్లకు కూడా అంతే వేతనం లభించనుంది. అయితే ఎక్కువ సంఖ్యలో ఆడిన మ్యాచ్లు, ఫార్మాట్ల కారణంగా మహిళల కంటే పురుషులు అధికంగా సంపాదించనున్నారు.