BCCI: టీమ్ ఇండియా కోచింగ్ సిబ్బందిలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల అనంతరం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుత కోచింగ్ వ్యవస్థను సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సహాయక సిబ్బందిలోని కనీసం ఇద్దరు సభ్యులు జట్టును వీడే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నివేదికల ప్రకారం, సీనియర్ సహాయకుల్లో ఒకరు ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరో కోచ్ కూడా త్వరలోనే జట్టుకు వీడ్కోలు పలకవచ్చని అంచనా. అయితే ఈ మార్పులకు ఇటీవలి పరాజయాలు ప్రత్యక్ష కారణం కాదని, గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న అంతర్గత అంశాలే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, జింబాబ్వే పర్యటనతో పాటు 2026 ఆసియా క్రీడలకు వీవీఎస్ లక్ష్మణ్ను ప్రధాన కోచ్గా నియమించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెనుక బోర్డు భవిష్యత్తు ప్రణాళికలు లేదా ప్రత్యామ్నాయాల అన్వేషణ ఉండవచ్చని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గంభీర్ సహాయకులపై వేటు..!
జూలై 2024లో హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ తనకు సన్నిహితులైన పలువురిని సహాయక సిబ్బందిలో చేర్చుకున్నారు. అయితే కాలక్రమేణా సిబ్బందిలో మార్పులు చోటుచేసుకుంటూ వచ్చాయి. తాజాగా బీసీసీఐ సమీక్షతో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది అంటున్నారు.. మొత్తంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగస్టులో జరిగే శ్రీలంక పర్యటనకు ముందు ప్రస్తుత కోచింగ్ వ్యవస్థను సమీక్షించే అవకాశం ఉంది. గంభీర్ సహాయక సిబ్బంది బీసీసీఐతో 2+1 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశారు. తొలి రెండేళ్ల తర్వాత, బోర్డు మరియు కోచ్ ఇద్దరికీ ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించుకునే అవకాశం ఉంది. భారత జట్టు ఇటీవల ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఓడిపోయింది, అలాగే ఇంగ్లాండ్ పర్యటనలో కూడా జట్టు ప్రదర్శన అంచనాలకు తగ్గట్టుగా లేదు. అయితే, సహాయక సిబ్బందిలో జరగబోయే మార్పులకు ఈ ఓటములతో ప్రత్యక్ష సంబంధం లేదని ఆ నివేదిక పేర్కొంది. గత కొన్ని నెలలుగా కోచింగ్ సిబ్బందిలో నెలకొన్న అంతర్గత సమస్యలే దీనికి కారణమని భావిస్తున్నారు.
లక్ష్మణ్కు ఈ బాధ్యతను అప్పగించడంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్కు బీసీసీఐ గంభీర్ను, అతని సహాయక సిబ్బందిని నియమించలేదు. ఈ పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత జపాన్లో జరిగే 2026 ఆసియా క్రీడల్లో ఆయన భారత జట్టుకు కోచ్గా వ్యవహరిస్తారు. ఈ నిర్ణయంపై కొందరు బోర్డు అధికారులు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, “వీవీఎస్ లక్ష్మణ్ను జింబాబ్వేకు పంపాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఆయన్ను ఆసియా క్రీడలకు పంపాలనే ప్రణాళిక కూడా అంతుచిక్కడం లేదు. ఈ విషయంలో పైకి కనిపించే దానికంటే ఏదో జరుగుతోంది.. బహుశా బోర్డు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోందేమో అని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు..

