Aakash Chopra on MS Dhoni CSK Stake: ‘ఎంఎస్ ధోనీ’.. ఈ పేరుకు, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంటుంది. 2026 ఐపీఎల్ సీజన్లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా.. సీఎస్కేకు సంబంధించిన ప్రతి అంశంలో అతడి పేరు చర్చలో నిలిచింది. ఈ నేపథ్యంలో ధోనీకి సీఎస్కేలో వాటా ఇవ్వాలనే అంశంపై వచ్చిన ఓ నివేదిక ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. క్రిక్బ్లాగర్ కథనం ప్రకారం.. సీఎస్కేలో 25 శాతం వాటా కావాలని ధోనీ మొదట కోరాడని, ఆ తర్వాత దాన్ని 20 శాతానికి తగ్గించాడని ప్రచారం జరిగింది. అయితే ఫ్రాంచైజీ నుంచి ధోనీకి 5.5 శాతం వాటా ఆఫర్ వచ్చినట్లు కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ వార్తలపై మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.
ఇది ఫేక్ న్యూస్:
ఈ కథనం తనకు వాస్తవికంగా అనిపించడం లేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘ఎంఎస్ ధోనీ సీఎస్కేలో 25 శాతం వాటా అడిగాడనే విషయం నమ్మశక్యంగా లేదు. ఈ వార్తను ఎవరో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసి ఉండవచ్చని నాకు అనిపిస్తోంది. అయితే నా వద్ద అందుకు సంబంధించి ఆధారాలు లేవు. కాబట్టి దీన్ని ఫేక్ న్యూస్ అని చెప్పలేను’ అని ఆకాశ్ పేర్కొన్నాడు. సీఎస్కే బ్రాండ్ వాల్యూను ప్రస్తావిస్తూ.. ఆకాశ్ తన విశ్లేషణను వివరించాడు. ‘ఆర్సీబీ ఫ్రాంచైజీ వాల్యూ ఇటీవల సుమారు 1.7 నుంచి 1.8 బిలియన్ డాలర్లకు చేరింది. సీఎస్కే కూడా అంతటి భారీ విలువ కలిగిన ఫ్రాంచైజీనే. ఐదు ఐపీఎల్ టైటిళ్లు, దేశం వెలుపల కూడా పలు ఫ్రాంచైజీలతో అనుబంధం, భారీ బ్రాండ్ విలువ ఉంది. అంతటి పెద్ద ప్రాంచైజీ సీఎస్కేలో 25 శాతం వాటా అంటే అత్యంత భారీ మొత్తం’ అని పేర్కొన్నాడు.
450 మిలియన్ డాలర్లు:
సీఎస్కే విలువను 1.8 బిలియన్ డాలర్లుగా తీసుకుంటే.. దాని 25 శాతం వాటా విలువ సుమారు 450 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఆకాష్ చోప్రా వివరించాడు. ఇంత భారీ మొత్తాన్ని ఒక వ్యక్తికి వాటాగా ఇవ్వడం, అది కూడా ఎంఎస్ ధోనీకి ఇవ్వడం వాస్తవికంగా అనిపించడం లేదన్నాడు. 25 శాతం వాటాను పొందాలంటే దాదాపు 400 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి అని.. ఫ్రాంచైజీ ఆ స్థాయి వాటాను ఎవరికైనా ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నాడు. అంతేకాదు 5.5 శాతం వాటా అనే ప్రచారం కూడా చిన్న విషయం కాదని ఆకాశ్ అన్నాడు. సీఎస్కే వంటి ఫ్రాంచైజీలో రెండు, మూడు లేదా ఐదు శాతం వాటా కూడా వందల మిలియన్ల విలువకు చేరే అవకాశముందన్నాడు. కాబట్టి 3.5 శాతం నుంచి 5.5 శాతం వరకు వాటా గురించి వచ్చిన వార్తలను కూడా అనుమానంగానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
కావాలనే ప్రచారం చేశారు:
’25 శాతం అడిగారు, తిరస్కరించారు. ఆ తర్వాత 3.5 శాతం, చివరకు 5.5 శాతానికి ఒప్పందం కుదిరిందనే కథనం నాకు నిజం అనిపించడం లేదు. ఇది ఎవరో కావాలనే ప్రచారం చేసిన కథనం కావచ్చని అనిపిస్తోంది’ అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 25 శాతం వాటా అంటే మాములు విషయం కాదని, అంత డబ్బు ఫ్రీగా ఎవరైనా ఇస్తారా? అని ఆకాష్ అంటున్నాడు. ఇక 2026 ఐపీఎల్లో ధోనీ ఆటగాడిగా కనిపించకపోయినా.. సీఎస్కేలో అతడి ప్రాధాన్యం మాత్రం కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో జట్టుతో ధోనీ సంబంధం ఎలా ఉండబోతుంది?, యాజమాన్య స్థాయిలో అతడికి ఏదైనా వాటా లభించనుందా? అనే ప్రశ్నలు ఇప్పటికే ఆసక్తిని పెంచుతున్నాయి. సీఎస్కేలో ధోనీకి వాటా శాతంపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

