Mohammad Amir On Playing IPL 2027: పాకిస్థాన్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల బ్రిటిష్ పౌరసత్వం పొందిన అమీర్.. ఇంగ్లండ్లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పౌరసత్వం దక్కడంతో దేశీయ ఆటగాడిగా అతడు బరిలోకి దిగాడు. బ్రిటిష్ పౌరసత్వానికి సంబంధించిన అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తవడంతో.. భవిష్యత్తులో మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా అమీర్ ఆడే అవకాశాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాక్ క్రికెటర్లకు ప్రస్తుతం ఐపీఎల్లో ఆడడం లేదు. ఐపీఎల్ మొదటి ఎడిషన్లో ఆడిన పాకిస్థాన్ ప్లేయర్స్.. ఆపై ఆడడం లేదు. అయితే బ్రిటిష్ పౌరసత్వం పొందిన మహ్మద్ అమీర్.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం తన పేరును వేలంలో నమోదు చేసుకునేందుకు అర్హత పొందాడు. దీంతో 2027 ఐపీఎల్లో అమీర్ ఆడుతాడా? అని అభిమానులు, నెటిజెన్లు తెగ చర్చిస్తున్నారు.
ఈ అంశంపై మహ్మద్ అమీర్ తాజాగా స్పందిస్తూ.. తన తొలి ప్రాధాన్యం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కే అని స్పష్టం చేశాడు. ‘2027లో నేను విదేశీ ఆటగాడిగా పీఎస్ఎల్లో ఆడతాను. ఐపీఎల్లో పాల్గొంటానా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా తొలి ప్రాధాన్యం మాత్రం పీఎస్ఎల్’ అని ది హండ్రెడ్ టోర్నీ సందర్భంగా అమీర్ వెల్లడించాడు. గతంలో పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ అజర్ మహ్మూద్ బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత ఐపీఎల్లో ఆడాడు. 2012 నుంచి 2015 వరకు పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మహ్మూద్.. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కూడా కొన్ని మ్యాచ్లు ఆడాడు. అదే తరహాలో అమీర్ కూడా ఐపీఎల్లో అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదు.
2024 టీ20 ప్రపంచ కప్ అనంతరం మహ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పాకిస్థాన్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అమీర్.. అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్లలో ఆడుతున్నాడు. అతడికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అమీర్ భవిష్యత్తులో ఐపీఎల్లో కనిపిస్తాడా లేదా అన్న అంశం క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

