ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్న టీం ఇండియా మొదట న్యూజిలాండ్తో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో.. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్లో పోటీపడనుంది. అయితే ఈ జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గత రెండేళ్లుగా పేలవ ఫామ్తో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆడిన కుల్దీప్.. ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం పై తాజాగా కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో నేను లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ జట్టులో ఉండాలనుకున్నా. ఇలాంటి సమయంలో బాధపడటం సహజమే. నేను ఇంగ్లండ్కు వెళ్లలేదు. కాబట్టి శ్రీలంక పర్యటనకు ఎంపికై అక్కడ రాణించే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా’ అని తెలిపాడు. కుల్దీప్ ఇప్పటివరకు భారత్ తరఫున 7 టెస్టులు, 63 వన్డేలు, 21 టీ20లు ఆడాడు.