మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్కింగ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే నెట్ బౌలర్గా ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ను చెన్నై జట్టు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ స్వయంగా వెల్లడించింది. ఈ లెఫ్టార్మ్ పేసర్కు ఈ అవకాశం మంచి అనుభవంగా మారాలని క్రికెట్ ఐర్లాండ్ ఆకాంక్షించింది. జోష్ లిటిల్ త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగనున్నాడు.
ఐర్లాండ్ యువ పేసర్ జోష్ లిటిల్ 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆరంభంలోనే మంచి పేస్తో బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం జోష్ లిటిల్ సొంతం. అంతేకాకుండా డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులను కట్టడి చేయగలడు. ఈ కారణంగానే చెన్నై జట్టు అతడిని నెట్బౌలర్గా తెచ్చుకుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 31 టీ20లు ఆడిన లిటిల్ 34 వికెట్లు పడగొట్టాడు.
