Suryakumar Yadav Set to Leave Mumbai Indians: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చుట్టూ ప్రస్తుతం ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు జట్టులో చోటు కూడా దక్కకపోవడంతో కెరీర్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సూరీడు.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ (ఎంఐ)తోనూ విడిపోతాడా? అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో సూర్య చేసిన మార్పులు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి.
సోమవారం ఉదయం అభిమానులు సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించగా.. ముంబై ఇండియన్స్కు సంబంధించిన ఒక్క ఫొటో, వీడియో కూడా లేదు. అంతేకాకుండా తన బయో నుంచి ‘ముంబై ఇండియన్స్’, ‘ముంబై’ పదాలను కూడా పూర్తిగా తొలగించినట్లు గుర్తించారు. ముంబై ఇండియన్స్ అధికారిక ఖాతాను అన్ఫాలో చేశాడు. ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఖాతాను కూడా అన్ఫాలో చేశాడు. సూర్య తన ప్రొఫైల్ పిక్చర్ను కూడా మార్చుకున్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా సూర్యకుమార్ను అన్ఫాలో చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో ఏకైక ముంబై ఇండియన్స్ పిక్ ఒకటి ఉంది. ఆ ఫొటోలో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీతో కలిసి సూర్య మాత్రమే కనిపించడం ఆసక్తికరంగా మారింది. దీంతో సూర్యకుమార్ ముంబై ఇండియన్స్తో తన అనుబంధాన్ని ముగించేందుకు సిద్ధమవుతున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ సూర్యకుమార్కు నిరాశాజనకంగా ముగిసింది. ముంబై తరఫున ఆడిన అతడు 270 పరుగులు మాత్రమే చేశాడు. 20.77 సగటుతో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. సూర్య పేలవ ప్రదర్శనతో పాటు జట్టు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై యాజమాన్యం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను భారత టీ20 జట్టు కెప్టెన్గా ఎంపిక చేయడం ఇటీవల పెద్ద చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా బ్యాటింగ్లో సూర్య ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో బీసీసీఐ సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ తీవ్ర నిరాశకు గురై ఉంటాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘గత 15 నుంచి 18 నెలలుగా సూర్య ఫామ్ బాగోలేదు. అయితే దేశానికి టీ20 ప్రపంచ కప్ గెలిపించిన కెప్టెన్ అతడు. సూరీడి కృషిని కూడా బీసీసీఐ గుర్తించాల్సిందే’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
ఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ లేదా ముంబై ఇండియన్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో జరిగిన మార్పులు అభిమానుల్లో అనుమానాలకు తావిస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ను వీడతాడా? లేదా ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం స్కై సోషల్ మీడియా చర్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
Suryakumar Yadav removed Mumbai Indians and Mumbai from his bio. He unfollowed Mumbai Indians. MI unfollowed him. He deleted all MI related pics and videos from his insta id. He changed his pfp too.
What’s cooking? pic.twitter.com/PL6ErA6tDc
— SKY n Supla Shot (@sky_63_mr_t20i) June 7, 2026

