ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్కు మరో భారీ షాక్ తగిలింది. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 200 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. పంజాబ్కు ఓటమి తప్పలేదు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 205/4 స్కోర్ చేసి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదో ఓటమిని చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200/8 పరుగులు చేసింది. ఒక దశలో 170-180 మధ్య స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించిన పంజాబ్.. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ ధాటిగా ఆడడంతో జట్టు స్కోర్ 200 పరుగుల మార్క్ దాటింది. అయితే భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో పంజాబ్ బౌలర్లు మరోసారి విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో సరైన బౌలింగ్ చేయలేకపోవడం జట్టుకు పెద్ద మైనస్గా మారింది. ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తెలుగు క్రికెటర్ తిలక్ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి మ్యాచ్ను పూర్తిగా ముంబై వైపు తిప్పేశాడు. తిలక్కు తోడు మిగతా బ్యాటర్లు కూడా కీలక సమయంలో బాధ్యతగా ఆడటంతో ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ ఓటమితో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరుపై ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో 200కిపైగా స్కోర్ను డిఫెండ్ చేస్తూ.. అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన కెప్టెన్గా శ్రేయస్ నిలిచాడు. ఇప్పటివరకు అతడు 20 మ్యాచ్ల్లో ఏడు ఓటములను ఎదుర్కొన్నాడు. దాంతో శ్రేయస్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇన్ని ఓటములు చవిచూసిన మొదటి సారథిగా శ్రేయస్ రికార్డుల్లో నిలిచాడు. ఒక్క ఫాఫ్ డుప్లెసిస్ మాత్రమే అన్ని టీ20 లీగ్ల కలిపి ఇంతకంటే ఎక్కువ ఓటములు చవిచూశాడు.
మరోవైపు పంజాబ్ కింగ్స్ 2026 సీజన్లో ఐదు వరుస విజయాల తర్వాత ఐదు వరుస పరాజయాలు చవిచూసిన రెండో జట్టుగా నిలిచింది. 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ ఇలానే వరుస పరాజయాలు చవిచూసింది. టోర్నీ తొలి భాగంలో అద్భుత ఫామ్లో కనిపించిన పంజాబ్.. ఇప్పుడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో పడింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్ల్లో తప్పనిసరిగా విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్ మాత్రం యువ ఆటగాళ్లతో అద్భుత పోరాటం చేస్తూ ఇతర జట్ల సమీకరణాలను దెబ్బతీస్తోంది.
