ఐపీఎల్ 2206లో వరుస ఓటములతో తల్లడిల్లిన లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఎట్టకేలకు అద్భుత విజయాన్ని అందుకుంది. గురువారం లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో 9 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ముందుగా లక్నో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) మెరుపు శతకం బాదాడు. ఛేదనలో ఆర్సీబీ 6 వికెట్లకు 203 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ రజత్ పాటీదార్ (61) టాప్ స్కోరర్. ఆర్సీబీపై సాధించిన ఈ విజయం ఎల్ఎస్జీకి ప్రత్యేకమైన విజయంగా నిలిచింది.
లక్నోలోని ఏకనా స్టేడియంలో వరుసగా ఎనిమిది పరాజయాలు ఎదుర్కొన్న ఎల్ఎస్జీ.. ఈ విజయంతో ఆ చెత్త రికార్డుకు ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో సొంత మైదానంలో అత్యధిక వరుస ఓటములు ఎదుర్కొన్న జట్ల జాబితాలో లక్నో ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అప్పటి ఢిల్లీ డేర్డెవిల్స్ 9 వరుస ఓటములతో అగ్రస్థానంలో ఉంది. 2013-15 మధ్య ఢిల్లీ వేదికగా డీసీ ఈ చెత్త రికార్డు నమోదు చేసింది. 2008-11 మధ్య అప్పటి డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్లో 8 వరుస ఓటములు చవిచూసింది. ఇప్పుడు 2025-26 మధ్య లక్నో కూడా 8 వరుస ఓటములు నమోదు చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు స్వదేశంలో ఇది తొలి విజయం కావడం విశేషం. అంతేకాదు ఏకనా స్టేడియంలో ఆర్సీబీపై లక్నోకు ఇది తొలి విజయం కూడా. గత రెండు మ్యాచ్ల్లో బెంగళూరుపై ఓడిన ఎల్ఎస్జీ.. మూడో ప్రయత్నంలో గెలిచింది. ఈ సీజన్లో లక్ష్య ఛేదనలో అద్భుత రికార్డు కొనసాగిస్తున్న ఆర్సీబీకి ఇది తొలి ఓటమి. ఇప్పటివరకు చేజింగ్లో నాలుగు మ్యాచ్లు గెలిచిన బెంగళూరు.. ఇప్పుడు మొదటిసారి పరాజయం పాలైంది. మరోవైపు టార్గెట్ను కాపాడుకోవడంలో ఇబ్బందులు పడుతున్న లక్నోకు ఇది తొలి విజయంగా నిలిచింది. గత నాలుగు మ్యాచ్లలో డిఫెండ్ చేయడంలో విఫలమైన ఎల్ఎస్జీ.. ఈసారి బౌలర్లు అద్భుతంగా రాణించి విజయాన్ని అందించారు.
వరుసగా ఆరు ఓటముల తర్వాత లక్నోకు ఇది తొలి విజయం కావడం మరో విశేషం. సొంత మైదానం లక్నోలో ఎనిమిది వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ గెలుపు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయినా.. చివరి వరకు పోరాడతామని ఎల్ఎస్జీ మరోసారి చూపించింది. అభిమానులు కూడా ఈ విజయంతో మళ్లీ జట్టుపై ఆశలు పెట్టుకున్నారు.
