Virat Kohli: SRH మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..

Virat Kohli

Virat Kohli

క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ ఎప్పుడూ లొంగని పట్టుదలకు, తిరుగులేని ఫిట్‌నెస్‌కు నిదర్శనంగా నిలుస్తాడు. పరుగుల వేటలో ఒడిదొడుకులు ఎదురైనా అతని దూకుడు తగ్గలేదు. అయితే.. బెంగళూరులో జరిగిన ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ తనలోని ఒక సున్నితమైన, అంతర్గత కోణాన్ని ఆవిష్కరించాడు. నిరంతరం అగ్రస్థానంలో కొనసాగడం వల్ల కలిగే మానసిక, అలసట తనను ఎలా ప్రభావితం చేసిందో నిజాయితీగా అంగీకరించాడు.

తాను, తన భాగస్వామి (అనుష్క శర్మ) తమపై అత్యున్నత అంచనాలను పెట్టుకున్నామని.. ఆ క్రమంలో రోజువారీ జీవితంలో సాధారణంగా ఉండటాన్ని కోల్పోయానని కోహ్లీ తెలిపాడు. ప్రతిదీ అనుకున్నట్లు సాగాలనే తపనతో తనపై తానే విపరీతమైన ఒత్తిడి తెచ్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఒత్తిడి సమయాల్లో అప్పటి కోచింగ్ బృందం రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్, విక్రమ్ రాథోడ్‌లు తనకు ఎంతగానో మద్దతుగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు.

2020-2022 మధ్య కాలంలో కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు చాలామంది అతని టెక్నిక్, షాట్ సెలెక్షన్‌పై విమర్శలు చేశారు. కానీ అసలు కారణం అది కాదని, నిరంతర పరిశీలన, ఒత్తిడి వల్ల ఏర్పడిన మానసిక అలసటేనని కోహ్లీ మాటలను బట్టి అర్థమవుతోంది. రికార్డులు సృష్టించడం మాత్రమే కాకుండా, జట్టు సంస్కృతిని కాపాడటం, అంచనాలను మోయడం వంటి బాధ్యతలే తనను ఎక్కువగా అలసిపోయేలా చేశాయని వివరించాడు.

అయితే.. కోహ్లీ ఈ మానసిక అలసటను బలహీనతగా చూడలేదు. దానిని అధిగమించి, తన భావోద్వేగాలపై ‘స్వయం నియంత్రణ’ సాధించడమే అత్యుత్తమమని గ్రహించాడు. క్రీడాకారులు కేవలం శారీరక దృఢత్వమే కాకుండా, మానసిక సమతుల్యత, స్వీయ అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో కోహ్లీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో ఈ స్వీయ అవగాహన మంత్రాన్ని నింపుతూ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లీగ్ దశలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే చివరి లీగ్ మ్యాచ్ కోసం కింగ్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు.