Site icon NTV Telugu

Uppal Metro: ఐపీఎల్ మ్యాచ్ వేళ భాగ్యనగరంలో హై టెన్షన్.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు..

Hyderabad Metro

Hyderabad Metro

భాగ్యనగరంలోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో శుక్రవారం ఒక్కసారిగా కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బాంబు బెదిరింపు కాల్‌తో ప్రయాణికులు, మెట్రో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 18) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలకమైన ఐపీఎల్ 2026 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే?
శుక్రవారం ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, స్టేషన్ ఆవరణలో బాంబు పెట్టినట్లు హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన మెట్రో అధికారులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులకు తెలియడంతో వారంతా భయంతో పరుగులు తీశారు. దీంతో కాసేపు స్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.

Also Read:Simple Ultra: ఏథర్, ఒలాకు గట్టి సవాల్.. సింపుల్ అల్ట్రా 400KM రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

పోలీసుల మెరుపు తనిఖీలు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. మెట్రో స్టేషన్‌లోని రెండు ప్లాట్‌ఫారమ్‌లు, పార్కింగ్ ఏరియా.. అనుమానం వచ్చిన ప్రతి మూలను అధికారులు జల్లెడ పట్టారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం స్టేషన్‌లో ఎటువంటి బాంబు లేదని పోలీసులు నిర్ధారించారు. అది కేవలం ఒక ‘హోక్స్ కాల్’ (నకిలీ బెదిరింపు) అని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌పై ప్రభావం..?
రేపు (శనివారం) సాయంత్రం 7:30 గంటలకు SRH vs CSK మ్యాచ్ జరగనుంది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ సమయాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ వేలాదిమంది అభిమానులతో కిక్కిరిసిపోతుంది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపడుతున్నారు. ఇలాంటి ఆకతాయి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం మెట్రో సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులు, క్రికెట్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారు.

Exit mobile version