ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్న సంజూ, ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మరో అద్భుత శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్ 2026లో సంజూకు రెండో శతకం ఇది. మైదానంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం బెదరకుండా క్రీజులో పాతుకుపోయిన శాంసన్, తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. నిలకడలేమి అన్న విమర్శలకు తన బ్యాట్తోనే గట్టి సమాధానమిస్తూ, ఈ మ్యాచ్లో కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో 10 క్లాసిక్ బౌండరీలు, 6 భారీ సిక్సర్లు ఉండటం విశేషం.
ఈ మ్యాచ్లో సంజూకి తోడుగా రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రేవిస్ (22), దినేష్ కార్తిక్ (18), మరియు ఓవర్టన్ (15) తమ వంతు సహకారాన్ని అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు నమోదైంది. ముంబై బౌలర్లలో ఘజానన్, అశ్వనీ చెరో రెండు వికెట్లు తీసి వికెట్ల పతనాన్ని అడ్డుకోవాలని చూసినా, సంజూ సృష్టించిన విధ్వంసం ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ సెంచరీతో సంజూ శాంసన్ టీ20 క్రికెట్ చరిత్రలో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ (చెరో 9 శతకాలు) అగ్రస్థానంలో ఉండగా, సంజూ శాంసన్ తన 8వ శతకంతో రోహిత్ శర్మ సరసన చేరాడు. ఇక ఐపీఎల్ చరిత్ర విషయానికొస్తే, అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్లలో కోహ్లీ (8), జోస్ బట్లర్ (7), క్రిస్ గేల్ (6) తర్వాత 5 సెంచరీలతో సంజూ శాంసన్, కేఎల్ రాహుల్తో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో రికార్డులన్నీ బద్ధలు కొట్టిన సంజూ, ముంబై ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచాడు. సంజూ చూపించిన ఈ వీరవిహారం అతన్ని భారత టీ20 క్రికెట్లో మరో స్థాయికి తీసుకెళ్లింది.
