రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడంపై ఆ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 75 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ విజయంపై మాల్యా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో స్పందిస్తూ.. “ఆర్సీబీ.. ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచినందుకు అభినందనలు. మన పెద్ద సింహాలు గర్జించి మనందరినీ గర్వపడేలా చేశాయి” అని పోస్ట్ చేశారు. ముంబై, చెన్నై తర్వాత వరుసగా రెండుసార్లు కప్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది.
RCB RCB….Congratulations Double back to back IPL Champions. Namma dodda Simhagulu roared loudly and made us all very proud. Very well done you beauties.
— Vijay Mallya (@TheVijayMallya) May 31, 2026
గత ఏడాది ఆర్సీబీ గెలిచినప్పుడు జరిగిన తొక్కిసలాట ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి బెంగళూరులో ఎలాంటి రోడ్ షో లేదా విజయ యాత్ర నిర్వహించకూడదని మేనేజ్మెంట్ నిర్ణయించింది. గత ఏడాది జరిగిన చేదు అనుభవాన్ని పునరావృతం కానివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అదే రోజు చిన్నస్వామి స్టేడియం సమీపంలోని లోక్ భవన్లో జరగనుంది. సీఎం ప్రమాణ స్వీకారానికి భారీగా జనం, ప్రముఖులు వస్తుండటంతో పోలీసులకు భద్రత కల్పించడం సవాలుగా మారింది. అందువల్ల నగర వీధుల్లో బహిరంగ వేడుకలు జరపకూడదనే పోలీసుల నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది.
