Muttiah Muralitharan: ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. ఇందులో క్రికెట్ ఎక్కడ ఉందని లెజెండరీ స్పిన్నర్, సన్రైజర్స్ హైదరాబాద్(SRH) స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఇక, ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం చూస్తుంటే.. అసాధ్యం అనుకున్నవి అత్యంత సహజంగా మారిపోయాయని అర్థమవుతోంది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే 265, 244, 229 వంటి భారీ స్కోర్లు ఛేజ్ అవ్వడం ఐపీఎల్లోనే అరుదైన రికార్డులు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్కు మధ్య అసమతుల్యతపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. బ్యాటింగ్ సరళి మారిపోయింది. ఇక బౌండరీలు వెనక్కి జరపాలా? అన్న అంశంపై తాజాగా సన్రైజర్స్ బౌలింగ్ కోచ్, స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఇచ్చిన సమాధానం క్రీడాభిమానులను ఆలోచింపజేస్తోంది.
బౌండరీల దూరం పెంచడం వల్ల పెద్దగా మార్పు ఉండదని, అసలు సమస్య పిచ్లలో ఉందని మురళి అభిప్రాయపడ్డారు. “పిచ్లను బౌలర్లకు అనుకూలంగా మారిస్తే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. టీ20 అభిమానులు వినోదాన్ని కోరుకుంటారు. వాళ్లకు కావాల్సింది ఫోర్లు, సిక్సర్లే. ఈ టోర్నీని వినోద సాధనంగా (Entertainment Product) చేశారు తప్ప, క్రికెట్ అభివృద్ధి కోసం కాదు. ప్రస్తుతం ఇది ఒక భారీ వ్యాపారం” అని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన రాకతో జట్లకు అదనపు బ్యాటర్ అందుబాటులోకి వచ్చాడని, దీనివల్ల వికెట్లు కాపాడుకోవాలనే భయం లేకుండా బ్యాటర్లు తొలి బంతి నుంచే విరుచుకుపడుతున్నారని విశ్లేషించారు. ఐపీఎల్ యాజమాన్యం సైతం ఈ నిబంధనను కనీసం 2027 వరకు కొనసాగించాలని నిర్ణయించడం వెనుక ఉన్న వ్యాపార కోణాన్ని మురళి స్పష్టంగా వివరించారు.
ఐపీఎల్ ఇప్పుడు మహిళలు, యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఒక సర్వే ప్రకారం.. 18-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతలో ఐపీఎల్ క్రేజ్ 68% మేర పెరిగింది. ఈ కొత్త తరం ప్రేక్షకులకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మెరుపులు, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి కుర్రాళ్ల విధ్వంసకర హిట్టింగ్ అంటేనే ఎక్కువ ఆసక్తి పెరిగిందని మురళి తెలిపారు. ఈ పరుగుల వరద చూసి కొందరు కోచ్లు ఆందోళన చెందుతున్నప్పటికీ.. ప్రేక్షకులు దీన్ని ఆస్వాదిస్తున్నంత కాలం ఈ ధోరణి మారదని అర్థమవుతోందన్నారు. ప్రస్తుత బ్యాటింగ్ దూకుడును చూస్తుంటే, తనతో పాటు షేన్ వార్న్ వంటి దిగ్గజాలు బౌలింగ్ చేసినా ఈ పిచ్లపై పెద్దగా ప్రభావం చూపలేరని మురళి నిజాయితీగా ఒప్పుకున్నారు. “మేము బంతిని తిప్పగలమేమో కానీ, ఒక్కో ఓవర్లో 10 పరుగులు చొప్పున 40 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చేది. స్కోరును 200 లోపు నియంత్రించాలంటే మా లాంటి బౌలర్లు ముగ్గురు నలుగురు ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
