రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు. సాధారణంగా మ్యాచ్ ఆరంభంలో బ్యాటర్లు ఆచితూచి ఆడతారు, కానీ జైస్వాల్ మాత్రం విధ్వంసకర శైలిలో విరుచుకుపడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సార్లు (4 సార్లు) మొదటి బంతికే సిక్సర్ కొట్టిన ఏకైక ఆటగాడిగా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. అతని దూకుడు ప్రత్యర్థి బౌలర్లలో వణుకు పుట్టిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన 43వ మ్యాచ్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ తరపున యశస్వి జైస్వాల్ క్రీజులోకి వచ్చాడు. ఢిల్లీ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతినే జైస్వాల్ సిక్సర్గా మలిచాడు.
ఐపీఎల్ చరిత్రలో మ్యాచ్ మొదటి బంతికే సిక్సర్ కొట్టిన ఐదో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధికంగా 4 సార్లు తొలి బంతికే సిక్సర్ బాదిన ఘనత ఇప్పుడు జైస్వాల్ సొంతం. అతని తర్వాత ప్రియాన్ష్ ఆర్య (2 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. తొలి బంతికే సిక్సర్ కొట్టినప్పటికీ, జైస్వాల్ 3 బంతుల్లో 6 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లోనే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నమన్ ఓజా, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వంటి దిగ్గజాల సరసన చేరిన యశస్వి.. తనదైన శైలిలో రికార్డుల రారాజుగా మారుతున్నాడు.
