Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..

Vaibhav

Vaibhav

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ 15 ఏళ్ల టీనేజర్.. మొత్తంగా 29 బంతుల్లో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ సమయంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల (59 సిక్సర్లు) రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతను ఏకంగా 583 పరుగులు సాధించాడు.

ఇతడి బ్యాటింగ్ విన్యాసాలకు ముగ్ధులైన మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాష్ చోప్రా లైవ్ కామెంట్రీలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ గనుక ఐపీఎల్ వేలంలోకి వస్తే ఎంత ధర పలుకుతాడని హర్భజన్ సింగ్ అడగ్గా.. సెహ్వాగ్ ఏమాత్రం ఆలోచించకుండా తాను రూ. 30 కోట్లు పెట్టడానికైనా సిద్ధమేనని ప్రకటించాడు. దీనికి వెంటనే స్పందించిన ఆకాష్ చోప్రా.. తాను కూడా రెండో ఆలోచన లేకుండా అంతే మొత్తాన్ని వేలంలో ఆఫర్ చేస్తానని చెప్పడం విశేషం.

×
×
Ad

మరోవైపు ఈ అద్భుత ప్రదర్శనతో సూర్యవంశీని టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంపిక చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. వచ్చే నెలలో తిలక్ వర్మ నేతృత్వంలో శ్రీలంకతో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం భారత్-ఏ జట్టులో ఈ వండర్ కిడ్‌కు చోటు దక్కింది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ సైతం వైభవ్ సూర్యవంశీని అరుదైన ప్రతిభ గల ఆటగాడిగా అభివర్ణించారు. శారీరక నైపుణ్యంతో పాటు మానసిక దృఢత్వంపై బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నాయని, తద్వారా అతను భారత్ తరఫున సుదీర్ఘ కాలం రాణిస్తాడని ధుమాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.