రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. ముల్లాన్పూర్లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్తో రాజస్థాన్ ప్రయాణం ముగిసినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ను అద్భుతమైన రికార్డులతో ముగించాడు. 15 ఏళ్ల ఈ వండర్కిడ్ 16 మ్యాచ్ల్లో 48.50 సగటుతో, 237.31 భారీ స్ట్రైక్ రేట్తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తన భయం తెలియని, వీరోచిత బ్యాటింగ్ శైలితో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ క్రికెట్ అభిమానులను మైమరపించాడు.
యశస్వి జైస్వాల్ ఫామ్పై ఆకాశ్ చోప్రా ఆందోళన
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అందరి దృష్టి సూర్యవంశీ పైనే ఉంది. అదే సమయంలో, అతనితో పాటు ఓపెనర్గా వచ్చిన యశస్వి జైస్వాల్ ఫామ్ ఈ సీజన్లో కాస్త పడిపోయింది. జైస్వాల్ 16 మ్యాచ్ల్లో 30.50 సగటు, 152.50 స్ట్రైక్ రేట్తో 427 పరుగులు చేశాడు.
చాలా మ్యాచ్ల్లో జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బౌలర్లపై దాడి చేయడానికి ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. దీనిపై మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో స్పందిస్తూ.. జైస్వాల్, సూర్యవంశీ పక్కన బ్యాటింగ్ చేయడం వల్ల ఒత్తిడికి గురవుతున్నాడని అభిప్రాయపడ్డాడు.
“నాకు యశస్వి జైస్వాల్ గురించి కాస్త ఆందోళనగా ఉంది. మీరు ఒక సునామీ పక్కన నిలబడితే, మీరు ఎంత గొప్పవారైనా సరే, కేవలం కొన్ని చిన్న కెరటాల లాగే కనిపిస్తారు. అవతలి వైపు జరుగుతున్న ఆ అసాధారణ బ్యాటింగ్ను అందుకోవడం ఎవరికైనా అసాధ్యం, కానీ జైస్వాల్ కూడా అతనిలాగే ఆడాలని ప్రయత్నిస్తున్నాడు. వైభవ్ ఆడుతున్న తీరు చూసి యశస్వి ఒత్తిడి ఫీల్ అవుతున్నాడు, అందుకే మొదటి ఓవర్లోనే అలా అవుట్ అయ్యాడు. ఇది అతనికి ఒక సాధారణ సీజన్. అతను ఎటో కొట్టుకుపోకూడదని నేను నిజంగా కోరుకుంటున్నాను,” అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
రాణించిన ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్
రాజస్థాన్ రాయల్స్ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా అద్భుత ప్రదర్శన చేశారు. మిడిల్ ఆర్డర్కు కొండంత అండగా నిలిచిన జురెల్ ఈ సీజన్లో 515 పరుగులు చేయగా.. జోఫ్రా ఆర్చర్ ఏకంగా 25 వికెట్లు పడగొట్టి జట్టు క్వాలిఫయర్ 2 చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పవర్ప్లేలో ఆర్చర్ వేసిన స్పెల్స్ రాజస్థాన్కు ఎంతో ప్లస్ అయ్యాయి. అలాగే ఫినిషర్గా ఫెరీరా ప్రదర్శన కూడా చాలా బాగుంది అని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.
