ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముల్లాన్పూర్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక పోరులో హైదరాబాద్ జట్టు వ్యూహాత్మక లోపాలు, ఆటపై కనీస అవగాహన లేకపోవడం వల్లే 47 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిందని విమర్శించాడు.
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అశ్విన్, ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఆటతీరును తప్పుపట్టాడు. రాజస్థాన్ బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్ మినహా మిగిలిన బౌలర్లలో పెద్దగా పదును లేదని, ఈ విషయాన్ని గమనించకుండా హైదరాబాద్ బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారని అన్నాడు. క్రీజులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉంటే రవీంద్ర జడేజా, యశ్ రాజ్ పుంజాలను రాజస్థాన్ రంగంలోకి దించలేకపోయేదని, కానీ ఆ లాజిక్ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పూర్తిగా మర్చిపోయారని విశ్లేషించాడు.
ముఖ్యంగా ట్రావిస్ హెడ్ పేలవ ఫామ్పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో హెడ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించడం సరైన నిర్ణయం కాదని, అతను అసలు ఫిట్గా ఉన్నాడా లేదా అనే అనుమానం కలుగుతోందని అన్నాడు. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో ఎలాంటి బాధ్యత లేకుండా అనవసర షాట్ ఆడి హెడ్ వికెట్ కోల్పోయాడని మండిపడ్డాడు.
ఈ సీజన్లో పిచ్లను, పరిస్థితులను అంచనా వేయడంలో హైదరాబాద్ పదే పదే విఫలమైందని అశ్విన్ గుర్తుచేశాడు. గతంలో లక్నో, కోల్కతా జట్లతో జరిగిన మ్యాచ్ల్లోనూ ఎస్ఆర్హెచ్ ఇదే తరహా వ్యూహాత్మక తప్పిదాలు చేసిందని, ఇప్పటికైనా మేనేజ్మెంట్ ట్రావిస్ హెడ్ స్థానంపై పునరాలోచన చేయాలని అశ్విన్ హితవు పలికాడు.
