ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య బంధం ముగిసిందనే వార్త ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర సంచలనంగా మారింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్గా నియమించడంపై మొదట్నుంచీ అనేక విమర్శలు వచ్చాయి. అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ, భారీ అంచనాలతో హార్దిక్ బరిలోకి దిగాడు. అయితే, ఈ ఏడాది కెప్టెన్గా జట్టును సరైన దిశలో నడపలేక, ప్లేయర్గా ఆకట్టుకోలేక హార్దిక్ పూర్తిగా విఫలమయ్యాడు. మైదానంలో ఎదురైన వరుస పరాజయాలు, మైదానం బయట అభిమానుల నుంచి వచ్చిన ట్రోలింగ్ అతనిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ నేపథ్యంలోనే లీగ్ మధ్యలోనే అతను ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుండి అధికారికంగా తప్పుకున్న తర్వాత హార్దిక్ పాండ్య భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది. వరుస ఓటములతో తీవ్ర నిరాశకు గురైన హార్దిక్, జట్టు యాజమాన్యంతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడని లీగ్ వర్గాలు వెల్లడించాయి. ఫ్రాంచైజీతో పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని, వచ్చే సీజన్ నాటికి జట్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్తో అతని బంధానికి పూర్తిగా తెరదించినట్లయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్య తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై క్రికెట్ వర్గాల్లో సరికొత్త చర్చలు నడుస్తున్నాయి. అతను తిరిగి తన పాత జట్టు గుజరాత్ టైటాన్స్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గుజరాత్ను తొలి సీజన్ లోనే విజేతగా నిలిపి, మరుసటి ఏడాది రన్నరప్గా నిలబెట్టిన ట్రాక్ రికార్డ్ హార్దిక్కు ఉండటంతో ఆ జట్టు అతన్ని ఆహ్వానించే అవకాశం ఉంది. మరోవైపు బలమైన ఆల్రౌండర్, కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాడి కోసం చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కూడా హార్దిక్ వైపు మొగ్గు చూపుతున్నట్లు క్రీడా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ట్రేడింగ్ ప్రక్రియ లేదా రిటెన్షన్ ఆధారంగా ఆగస్టు నెల నాటికి హార్దిక్ పాండ్య ఏ జట్టు తరపున ఆడబోతున్నాడనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
హార్దిక్ పాండ్య ముంబై జట్టును వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ ఒక ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. హార్దిక్ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ముంబై ఇండియన్స్తో చెన్నై ఒక భారీ ట్రేడింగ్ డీల్ చేసుకోవచ్చని బద్రీనాథ్ సూచించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్రస్తుతం కీలక ఆటగాళ్లుగా ఉన్న శివమ్ దూబే, యువ బౌలర్ హిమాన్షు మాత్రేలను ముంబై ఇండియన్స్కు ఇచ్చి, వారికి బదులుగా హార్దిక్ పాండ్యను చెన్నైలోకి ట్రేడ్ చేసుకోవచ్చని ఆయన విశ్లేషించారు. శివమ్ దూబే ముంబైకి చెందిన ఆటగాడే కావడంతో పాటు వాంఖడే పిచ్పై అతనికి మంచి రికార్డు ఉందని, అలాగే యువ ప్లేయర్ మాత్రే కూడా ముంబై జట్టుకు భవిష్యత్తులో ఉపయోగపడతాడని బద్రీనాథ్ పేర్కొన్నారు.
ఈ ట్రేడింగ్ గనుక జరిగితే అటు ముంబైకి ఇటు చెన్నైకి ఇద్దరికీ లాభదాయకంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం ఎంతో ఉందని, హార్దిక్ పాండ్య వంటి మ్యాచ్ విన్నర్ ధోనీ గైడెన్స్లో మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోగలడని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ముంబై ఇండియన్స్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ, లోపల జరిగిన పరిణామాలు, మాజీల సూచనలు చూస్తుంటే ఆగస్టు నాటికి హార్దిక్ పాండ్య కెరీర్లో ఒక పెద్ద మార్పు రాబోతుందనేది స్పష్టమవుతోంది. ఒకప్పుడు ముంబై హీరోగా ఎదిగి, గుజరాత్కు కప్పు అందించి.. మళ్లీ ముంబైకి వచ్చి ఒత్తిడిలో చిక్కుకున్న హార్దిక్ భవిష్యత్తు ఏ జట్టుతో ముడిపడి ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
