Ajinkya Rahane: నిన్న(బుధవారం) కోల్కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) జట్లు ఈడెన్ గార్డెన్స్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉత్కంఠభరితంగా విజయం సాధించి, తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కోల్కతా ఏడు బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా మ్యాచ్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్యా రహానే తన మనసులోని మాటలను పంచుకున్నాడు. “వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత జట్టులో వాతావరణం చాలా భారంగా మారింది. అలాంటి క్లిష్ట సమయంలో మేమంతా కూర్చుని చాలా నిజాయితీగా, బాహాటంగా చర్చించుకున్నాం. నిజానికి మేము అప్పటివరకు బాగానే ఆడుతున్నా, మ్యాచ్ను మలుపు తిప్పే కీలక క్షణాలను చేజార్చుకున్నాం. అయితే, ఆ సిరీస్ ఓటముల తర్వాత వచ్చిన చిన్న విరామం (బ్రేక్), ఆ తర్వాతి మ్యాచ్లో సాధించిన విజయం మా జట్టు రూపురేఖలనే మార్చేశాయి. ఆ ఒక్క గెలుపుతో జట్టులో సరికొత్త జోష్ వచ్చింది, అందరిలో నమ్మకం పెరిగింది. నిజానికి ఆటగాళ్లలో నమ్మకం ఎప్పుడూ ఉంది, కానీ వరుస ఓటముల తర్వాత జట్టులో సానుకూల వాతావరణాన్ని కాపాడిన క్రెడిట్ అంతా మా సపోర్ట్ స్టాఫ్కే దక్కుతుంది. అంతటి ఒత్తిడిలోనూ వాతావరణం చెడకుండా చూసుకున్నాం, మా ప్రాక్టీస్ కూడా అద్భుతంగా సాగింది. మా విజయాలకు అసలు కారణం ఇదే.” అని రహానే వెల్లడించాడు.
ఇక ఆటగాళ్ల ప్రదర్శన విషయానికి వస్తే, కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పుడు తాము రోవ్మన్ పావెల్ను రంగంలోకి దించాలని అనుకున్నామని కెప్టెన్ రహానే తెలిపాడు. గ్రీన్ బౌలింగ్ చేసిన విధానం తమపై చూపెట్టిన ప్రభావం చాలా కీలకమైందని చెప్పాడు. అలాగే వరుణ్ చక్రవర్తి, సన్నీ (సునీల్ నరైన్) కలిసి బౌలింగ్ చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. వీరితో పాటు మరికొందరి పేర్లను తాను ప్రత్యేకంగా చెప్పాలని.. అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగిలు డొమెస్టిక్ సీజన్లో చూపించిన ఫామ్ను, నమ్మకాన్ని ఇక్కడికి కూడా మోసుకొచ్చారన్నాడు. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యత తీసుకుని, ప్రతిసారీ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశాడు.
ముఖ్యంగా మనీష్ పాండే గురించి మాట్లాడుతూ.. “తను తుది జట్టులో లేనప్పుడు కూడా చూపించిన క్రమశిక్షణ, సానుకూల వైఖరి అమోఘం. జట్టులో అవకాశం రానప్పుడు రోజూ మైదానానికి రావడం, బ్యాటింగ్, ఫీల్డింగ్పై కష్టపడటం, జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం ఏ ఆటగాడికైనా అంత సులువు కాదు. కానీ మనీష్ అది చేసి చూపించాడు. ఈ రాత్రి మ్యాచ్లో తను ఆడిన ఇన్నింగ్స్ చూసి నేను మాత్రమే కాదు, మా జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు ఎంతో సంతోషిస్తున్నాడు.” అని తెలిపాడు. తమ తదుపరి మ్యాచ్ వ్యూహాల గురించి రహానే మాట్లాడుతూ.. తాము ముందుచూపుతో కాకుండా మ్యాచ్ బై మ్యాచ్ వెళ్లాలని అనుకుంటున్నామన్నాడు.. గత 6-7 మ్యాచ్లుగా మాకు బాగా కలిసివచ్చిన సూత్రం ఒక్కటే.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత మ్యాచ్పైనే దృష్టి పెట్టడం, మా శాయశక్తులా పోరాడటం, మ్యాచ్ గమనాన్ని మార్చే కీలక క్షణాలను మాకు అనుకూలంగా మార్చుకోవడం. వచ్చే మ్యాచ్లోనూ మేము ఇదే పంథాను కొనసామని వెల్లడించాడు.
