IPL 2026 Playoffs Scenarios: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పరిస్థితి మాత్రం మరింత క్లిష్టంగా మారింది. ప్రస్తుతం ప్లేఆఫ్స్లో చివరి స్థానానికి ఐదు జట్లు పోటీలో ఉన్నాయి. అయితే సీఎస్కే అవకాశాలు కేవలం 3 శాతానికి పడిపోవడం అభిమానులను కలవరపెడుతోంది.
ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్కు అత్యధిక అవకాశాలు ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్ అంచనాల ప్రకారం.. రాజస్థాన్కు 50 శాతం అవకాశాలు ఉన్నాయి. కేకేఆర్, పంజాబ్ కింగ్స్కు తలో 19 శాతం అవకాశాలు ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్కు 9 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ఇక సీఎస్కే అవకాశాలు అత్యంత ప్రమాదకర స్థితికి చేరాయి. కేవలం 3 శాతం మాత్రమే ఉండడంతో.. దాదాపుగా రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఏ జట్టు ఎలా ప్లేఆఫ్స్ చేరొచ్చనేది ఓసారి చూద్దాం.
రాజస్థాన్ రాయల్స్:
రాజస్థాన్ రాయల్స్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలిస్తే.. నేరుగా ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిపోతే.. కేకేఆర్, పంజాబ్, సీఎస్కే, ఢిల్లీ జట్లు కూడా తమ చివరి మ్యాచ్ల్లో ఓడిపోవాలి. లేదంటే నెట్ రన్రేట్ కీలకం అవుతుంది.
పంజాబ్ కింగ్స్:
పంజాబ్ తమ చివరి మ్యాచ్లో తప్పక గెలవాలి. అలాగే రాజస్థాన్, కేకేఆర్ రెండూ ఓడిపోవాలి. రాజస్థాన్ గెలిస్తే పంజాబ్ నేరుగా టోర్నీ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఒకవేళ పంజాబ్, కేకేఆర్ గెలిచి.. రాజస్థాన్ ఓడిపోతే నెట్ రన్రేట్ కీలకం అవుతుంది.
కోల్కతా నైట్ రైడర్స్:
కేకేఆర్ కూడా తమ చివరి మ్యాచ్లో గెలవాలి. అలాగే రాజస్థాన్, పంజాబ్ రెండూ ఓడిపోవాలి. రాజస్థాన్ గెలిస్తే కేకేఆర్ ఆశలు ముగుస్తాయి. పంజాబ్ కూడా గెలిస్తే నెట్ రన్రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ బెర్త్ నిర్ణయమవుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్:
ఢిల్లీ పరిస్థితి మరింత కఠినంగా ఉంది. తమ చివరి మ్యాచ్ గెలవడంతో పాటు కేకేఆర్, పంజాబ్, రాజస్థాన్, సీఎస్కే అన్నీ ఓడిపోవాలి. రాజస్థాన్ లేదా కేకేఆర్ లేదా పంజాబ్లో ఏ ఒక్క జట్టు గెలిచినా ఢిల్లీ అవకాశాలు గల్లంతే.
చెన్నై సూపర్ కింగ్స్:
సీఎస్కే పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ముందుగా తమ చివరి మ్యాచ్లో గెలవాలి. అదే సమయంలో రాజస్థాన్, కేకేఆర్, పంజాబ్, ఢిల్లీ జట్లు అన్నీ ఓడిపోవాలి. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే.. సీఎస్కే, ఢిల్లీ, రాజస్థాన్ జట్లు సమాన పాయింట్లతో నిలిచే అవకాశం ఉంది. అప్పుడు నెట్ రన్రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ జట్టు తేలనుంది.
