IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!

  • సంచలనానికి దారితీసిన కోహ్లీ క్రేజ్
  • జోరుగా బ్లాక్ టికెట్ దందా
  • ఒక్కో టికెట్ ధర రూ.80 వేలు
  • బ్లాక్ దందాలో కీలక అధికారి ప్రమేయం
Ipl 2026 Black Tickets

Ipl 2026 Black Tickets

Black Tickets Market in IPL 2026: టీమిండియా క్రికెట్ దిగ్గజం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లీ క్రేజ్ మరోసారి సంచలనానికి దారితీసింది. ఐపీఎల్ 2026లో భాగంగా ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన బ్లాక్ టికెట్ల దందా వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు చెందిన ఓ కీలక అధికారి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది.

మీడియా కథనాల ప్రకారం.. డీసీ, ఆర్సీబీ మ్యాచ్‌కు సంబంధించిన కంప్లిమెంటరీ టికెట్లను భారీ ధరలకు విక్రయించినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఒక్కో టికెట్ రూ.80 వేల వరకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ముకీమ్ (35), గుఫ్రాన్ (36), మహ్మద్ ఫైసల్ (38) ఉన్నారు. వీరిని స్టేడియం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పెట్రోల్ బంక్ ఉద్యోగి పంకజ్ యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో టికెట్ల బ్లాక్ మార్కెట్ వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు బయటపడింది.

ఈ బ్లాక్ టికెట్ల దందా వెనక డీడీసీఏకి చెందిన ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ప్రాధాన్యం, స్టార్ ఆటగాళ్ల క్రేజ్‌ను బట్టి టికెట్ ధరలను నిర్ణయించేవారని ఢిల్లీ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్‌లకు భారీ డిమాండ్ ఉండటంతో.. ధరలను మరింత పెంచినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ‘ఇది చాలా సీక్రెట్ రాకెట్. చాలా పద్దతిగా జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టికెట్ ధరలు అమాంతం పెరిగేవి. ఆర్సీబీ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ ప్రధాన ఆకర్షణ. కోహ్లీ క్రేజ్‌ను వాడుకున్నారు. ఒక్కో టికెట్‌ను కనీసం రూ.80 వేల వరకు విక్రయించారు’ అని పోలీసు వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఒక్కో మ్యాచ్‌కు వెయ్యికి పైగా టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మైదనంలో నేరుగా మ్యాచ్ చూడాలనే అభిమానుల కోరికను ఆసరాగా చేసుకుని భారీ మొత్తంలో డబ్బు కాష్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఆతిథ్య ఫ్రాంచైజీ ప్రతి మ్యాచ్ టికెట్లలో 10 నుంచి 15 శాతం వరకు హోస్టింగ్ అసోసియేషన్‌కు కంప్లిమెంటరీ పాసులుగా ఇస్తుంది. ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసి.. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఐపీఎల్ టికెట్ వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. అభిమానులకు కాకుండా టికెట్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.