2026 ఏప్రిల్ 25.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చారిత్రాత్మక రోజుగా నిలిచిపోయింది. రెండు మ్యాచ్లు, బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు స్థాయి ఛేజింగ్లు, వ్యక్తిగత ప్రదర్శనలు.. అన్నీ కలిసొచ్చి అభిమానులకు మరచిపోలేని అనుభూతిని అందించాయి. ఢిల్లీ క్యాపిటల్స్vs పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ vs సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డ ఈ రెండు మ్యాచ్లు అభిమానులకు అసలైన రన్ ఫెస్టివల్గా మారాయి.
మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 152 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా నితీష్ రాణా 91 పరుగులు బాదాడు. కానీ ఈ భారీ స్కోర్ కూడా ఢిల్లీకి విజయంను అందించలేకపోయింది. పంజాబ్ కింగ్స్ అసాధారణంగా ఆడుతూ కేవలం 18.5 ఓవర్లలోనే 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభసిమ్రాన్ సింగ్ (76), శ్రేయాస్ అయ్యర్ (71), ప్రియాన్ష్ ఆర్య (43) జట్టుకు అద్భుత విజయం అందించారు.
మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ కూడా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా కేవలం 18.3 ఓవర్లలోనే 229 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లో 103 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఇషాన్ కిషన్ (74), అభిషేక్ శర్మ (57) అద్భుతంగా ఆడారు. శనివారం నమోదైన రికార్డులు ఐపీఎల్ స్థాయిని మరోసారి చాటాయి. 265 పరుగుల లక్ష్యాన్ని తొలిసారిగా విజయవంతంగా ఛేదించడం, ఒకే రోజులో రెండు 220+ ఛేజింగ్లు జరగడం వంటి అరుదైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తక్కువ వయసులోనే సెంచరీలు బాదుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఐపీఎల్ ఎందుకు ప్రపంచంలోనే నంబర్ వన్ లీగ్ అనిపిస్తుందో మరోసారి నిరూపించింది.
