Site icon NTV Telugu

Hardik Pandya: ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.. ముంబై ఓటములపై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Hardik Pandya

Hardik Pandya

సొంత మైదానంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ) 18 పరుగుల తేడాతో గెలిచింది. ఫిల్‌ సాల్ట్‌ (78), రజత్‌ పాటీదార్‌ (53), విరాట్‌ కోహ్లీ (50) రెచ్చిపోవడంతో ముందుగా బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 5 వికెట్లకు 222 పరుగులకే పరిమితమైంది. రూథర్‌ఫర్డ్‌ (71 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. హార్దిక్‌ పాండ్య (40) రాణించాడు. ఐపీఎల్ 2026లో ముంబై ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిచింది. ముంబై వరుస ఓటములపై కెప్టెన్ హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెత్త ప్రణాళికలే తన ఓటములకు కారణమని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఏ మాత్రం బాలేదని.. జట్టు, ప్రణాళికపై ఆలోచించాల్సిన సమయం వచ్చేసిందని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ‘మేము చాలా వికెట్లు కోల్పోయాం. అదే సమయంలో బౌలింగ్‌లో కూడా ఎక్కువ పరుగులు ఇచ్చాం. ముఖ్యంగా కొన్ని ఓవర్లలో ఎక్కువగా పరుగులు ఇవ్వడం వల్ల మ్యాచ్‌లో పూర్తిగా వెనుకబడిపోయాం. గత కొన్ని మ్యాచ్‌లుగా మేము గేమ్‌ను ముందుండి నడిపించడం కంటే.. వెనుకబడి పోరాడటమే అవుతుంది. జట్టు ప్రదర్శనపై సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాకు విరామం ఉంది. ఈ సమయంలో మా లోపాలను సరిదిద్దుకోవాలి. సరైన మోమెంటమ్ అందుకోవడానికి ఏం చేయాలో చర్చించాలి’ అని అన్నాడు.

టాస్, పిచ్ పరిస్థితులపై కూడా హార్దిక్ పాండ్య స్పందించాడు. ‘మేము కొన్ని మ్యాచ్‌లలో టాస్ గెలిచాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి కొత్త వ్యూహాలను పరిశీలించాలి. పిచ్ ఎలా ఉన్నా మేము బాగా బ్యాటింగ్, బౌలింగ్ చేయాల్సిందే. అలా చేస్తే టాస్ ప్రభావం ఎక్కువగా ఉండదు. పవర్‌ప్లేలో మేము వెనుకబడుతున్నాం. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ తేలిపోతున్నాం. అక్కడే మేం మూమెంటమ్ కోల్పోతున్నాం. ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రదర్‌ఫోర్డ్‌ సామర్థ్యం మాకు తెలుసు. అతను ఆడిన తీరు జట్టుకు అదనపు బలం, ఆత్మవిశ్వాసం ఇచ్చింది. అవసరమైతే జట్టులో మార్పులు చేయడానికి కూడా వెనకాడం. జట్టు అవసరాలకు తగ్గట్లు మార్పులు ఉంటాయి’ అని హార్దిక్ పేర్కొన్నాడు.

 

Exit mobile version