IPL 2026 Tickets Scam: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కొనసాగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఫ్రీ ఐపీఎల్ టికెట్లు, ఉచిత లైవ్ స్ట్రీమింగ్ పేరుతో అభిమానులను లక్ష్యంగా చేసుకుని భారీ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్సెక్ వెల్లడించింది. ఈ మోసాల్లో భాగంగా ఇప్పటికే 600కు పైగా ఫేక్ టికెట్ వెబ్సైట్లు, 400కు పైగా నకిలీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు గుర్తించినట్లు ఓ నివేదిక పేర్కొంది.
ఈ ఫేక్ వెబ్సైట్లు ఐపీఎల్ టికెట్ల విక్రయం అంటూ.. వినియోగదారుల నుంచి భారీగా డబ్బులు దోచుకుంటున్నాయి. మరోవైపు ‘ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్’ పేరుతో ప్రజలను ఆకర్షించి.. వారి ఫోన్లు, ల్యాప్టాప్లలో ప్రమాదకరమైన మాల్వేర్ను సైబర్ నేరగాళ్లు ఇన్స్టాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వెబ్సైట్లు చాలా ప్రొఫెషనల్గా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. మ్యాచ్ షెడ్యూల్స్, టీమ్ లోగోలు, ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్, కస్టమర్ రివ్యూలు వంటి ఫీచర్లు ఉండటంతో.. ఫేక్ వెబ్సైట్లు అసలైన సైట్లలా కనిపిస్తున్నాయి.
ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఈ ఫేక్ లింకులు సోషల్ మీడియా పోస్టులు, టెలిగ్రామ్ ఛానెల్స్, ఫోరమ్స్, యాడ్స్ ద్వారా విస్తృతంగా షేర్ అవుతున్నాయి. కొన్నిసార్లు యూజర్ ఏ డివైస్ వాడుతున్నాడో గుర్తించి దానికి అనుగుణంగా వేరువేరు హానికర పేజీలకు రీడైరెక్ట్ చేస్తున్నట్లు క్లౌడ్సెక్ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకంగా ‘SHub Stealer’ అనే ప్రమాదకర మాల్వేర్ను ఈ నకిలీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు ఇన్స్టాల్ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాల్వేర్ ఒకసారి డివైస్లో ఇన్స్టాల్ అయితే.. యూజర్ల పాస్వర్డ్స్, బ్రౌజర్ డేటా, మెసేజింగ్ యాప్ సెషన్స్, క్రిప్టో వాలెట్.. వంటి సమాచారంను సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. అంతేకాదు డివైస్లో ఉన్న ఫైల్స్ను కూడా హ్యాకర్లు సులభంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు కీలక సూచనలు చేశారు. ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేయాలంటే అధికారిక టికెటింగ్ ప్లాట్ఫామ్స్ను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ అంటూ వచ్చే అనుమానాస్పద వెబ్సైట్లను పూర్తిగా దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు. తెలియని ఫైల్స్ డౌన్లోడ్ చేయకూడదని, సోషల్ మీడియా లేదా వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని సూచించారు. ఐపీఎల్ క్రేజ్ను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అభిమానులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
