MS Dhoni Becomes 1st Batter to wins most matches in IPL: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 150 విజయాల్లో భాగమైన తొలి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదారాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై గెలవడంతో.. ఈ రికార్డు మహీ ఖాతాలో చేరింది. ధోనీ ఐపీఎల్లో ఇప్పటివరకు 259 మ్యాచ్లు ఆడి.. 150 విజయాల్లో భాగమయ్యాడు.
ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు 133 ఐపీఎల్ విజయాల్లో భాగమయ్యారు. వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (125), చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ సురేష్ రైనా (122) టాప్-5లో ఉన్నారు. ఐపీఎల్లో దాదాపుగా 250 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
Also Read: RCB vs GT: నేను హిట్టింగ్ చేయడానికి చేయడానికి కారణం అతడే: విల్ జాక్స్
ఐపీఎల్ 17 సీజన్లో ఎంఎస్ ధోనీ చెలరేగి ఆడుతున్న విషయం తెలిసిందే. సుడిగాలి ఇన్నింగ్స్లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్పై చివరి ఓవర్లో బ్యాటింగ్కు వచ్చి హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. గతేడాది కెప్టెన్సీతో ఆకట్టుకున్న ధోనీ.. ఈ సీజన్లో బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ఒక్కసారి కూడా అతడు ఔట్ కాకపోవడం విశేషం. చెన్నై ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఏడు సార్లు బ్యాటింగ్కు వచ్చాడు. 256 స్ట్రైక్రేటుతో 96 పరుగులు చేశాడు.