NTV Telugu Site icon

టెస్టుల్లో 3వేల పరుగులు పూర్తి చేసిన హిట్‌మ్యాన్‌…

హిట్‌మ్యాన్‌…జూలు విదిల్చాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాల్గో టెస్టులో…సెంచరీతో చెలరేగాడు. అతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో ఓవరాల్‌గా…8వ సెంచరీ నమోదు చేయడంతో…భార్య రితిక సంబరాల్లో మునిగిపోయారు.

టీమిండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ…నాల్గో టెస్టులో చెలరేగి ఆడాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హిట్‌మ్యాన్‌…సుదీర్ఘ ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై తొలి శతకం సాధించాడు. సిక్సర్‌తో వంద పరుగులు చేసిన రోహిత్ శర్మ…టెస్టుల్లో ఓవరాల్‌గా 8వ సెంచరీని పూర్తి చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే… హిట్‌మ్యాన్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. తొలి సెషన్‌లో రాహుల్‌ ఔటైనా.. పుజారాతో కలిసి సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలోనే 204 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో సెంచరీ సాధించాడు. అంతేకాదు…టెస్టుల్లో 3 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు.

మొయిన్‌ అలీ వేసిన 63.5 ఓవర్‌కు బంతిని సిక్సర్‌గా మలిచి ఈ రెండు రికార్డులు నమోదు చేశాడు. పుజారాతో కలిసి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 256 బంతుల్లో 127 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌…రాబిన్సన్‌ బౌలింగ్‌లో క్రిస్‌ వోక్స్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు.

మరోవైపు హిట్‌మ్యాన్‌ సెంచరీ పూర్తి చేయగానే టీమ్‌ఇండియా బాల్కానీ చప్పట్లతో మార్మోగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ సతీమణి రితిక సంతోషంలో మునిగిపోయారు.