అఫ్గానిస్తాన్తో జరిగిన మొదటి రెండు వన్డేల్లో ఘనవిజయాలు సాధించి సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు, తుది పోరుకు సిద్ధమవుతోంది. సిరీస్ దక్కడంతో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లేని లోటును భర్తీ చేస్తూ.. కొత్త కాంబినేషన్లను పరీక్షించడానికి, బెంచ్ బలాన్ని అంచనా వేయడానికి మేనేజ్మెంట్కు మంచి అవకాశం దొరికింది. ఇందులో భాగంగానే కోహ్లీ రెగ్యులర్ స్థానమైన నంబర్ 3లో ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్లను ఆడించి ప్రయోగాలు చేశారు. వారు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.
రాహుల్ స్థానంపై అసంతృప్తి..
అయితే, జట్టులో సీనియర్ టాప్-ఆర్డర్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ను లోయర్-ఆర్డర్లో (ఫినిషర్ పాత్రలో) నంబర్ 6 స్థానంలో బరిలోకి దించడంపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ మొదటి వన్డే ఛేజింగ్లో 19 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచినా, లక్నోలో జరిగిన రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు.
శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… “రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం అతనికి, జట్టుకు ఏమాత్రం మంచిది కాదు. అతని ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే నంబర్ 4 లేదా గరిష్టంగా నంబర్ 5 స్థానంలో ఆడించాలి. జట్టులో రొటేషన్ విధానాన్ని అమలు చేస్తూ, కొందరికి విశ్రాంతినిచ్చి మరికొందరికి అవకాశాలు ఇవ్వాలి” అని సూచించారు. ఈ సిరీస్ టైమింగ్ మరియు జూన్ నెలలో మ్యాచ్లు నిర్వహించడంపై శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ పెట్టడం సరికాదన్నారు.
ప్రస్తుతం ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నందున, దానిపై దృష్టి పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. చెన్నై వంటి తీవ్రమైన ఎండలు ఉండే ప్రాంతాల్లో జూన్ నెలలో ఆడించడం ఆటగాళ్లకు శారీరకంగా, మానసికంగా అలసట కలిగిస్తుందని, ఐపీఎల్ తర్వాత ఆటగాళ్లకు కనీసం నెల రోజుల విరామం అవసరమని ఆయన స్పష్టం చేశారు. కుటుంబంతో గడపడానికి, మానసిక విశ్రాంతికి సమయం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని శ్రీకాంత్ పేర్కొన్నారు. సిరీస్ గెలిచినప్పటికీ, రాహుల్ బ్యాటింగ్ స్థానం, ఆటగాళ్ల పనిభారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.

