Site icon NTV Telugu

CWG 2022: కామన్‌వెల్త్‌లో నేటి భారత షెడ్యూల్‌.. 40 పతకాలతో ఐదో స్థానం

India At Common Wealth Games 2022

India At Common Wealth Games 2022

CWG 2022: ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 40 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇందులో 13 స్వర్ణాలు, 11రజతాలు, 16 కాంస్య పతకాలు భారత్‌కు లభించాయి. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది. ఇవాళ కూడా పలు క్రీడల్లో భారత్‌కు చెందిన అథ్లెట్లు పాల్గొననున్నారు. మరి ఇవాళ ఏయే విభాగాల్లో భారత క్రీడాకారులు పాల్గొంటారో తెలుసుకుందాం.

హాకీ (మ.1:30 గంటల నుంచి): భారత్ vs న్యూజిలాండ్ (మహిళల కాంస్య పతక మ్యాచ్)

బ్యాడ్మింటన్ (మ.2:20 గంటల నుంచి): పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్, కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్ (మ.3.10 ), లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్ (మ.3.10 ), ట్రీసా జాలీ/గాయత్రి గోపీచంద్ మహిళల డబుల్స్ సెమీ- ఫైనల్ (సాయంత్రం 4 గంటలకు), చిరాగ్ శెట్టి/సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి పురుషుల డబుల్స్ సెమీ-ఫైనల్ (సాయంత్రం 4.50)

అథ్లెటిక్స్ (మ.2:45 గంటల నుంచి): పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్ – అబ్దుల్లా అబూబకర్, ఎల్దోస్ పాల్, ప్రవీణ్ చిత్రవేల్, పురుషుల 10 కిమీ రేస్ వాక్ ఫైనల్ -అమిత్, సందీప్ కుమార్ (మ. 3.50 నుంచి ), మహిళల జావెలిన్ త్రో ఫైనల్ – శిల్పా రాణి, అన్నూ రాణి (సాయంత్రం 4.05), మహిళల 4×100మీ ఫైనల్ (సాయంత్రం 5.24), పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ — రోహిత్ యాదవ్, డిపి మను (ఉదయం 12.10), పురుషుల 4×400మీ ఫైనల్ (ఉదయం 1గం)

బాక్సింగ్ (అన్ని ఫైనల్స్) (మ.3 గంటల నుంచి): నీతూ గంగాస్, అమిత్ పంగల్ (మ.3.15 గంటలకు), నిఖత్ జరీన్ (రాత్రి.7 గంటల నుంచి), సాగర్ అహ్లావత్ (మ.1.15 గంటల నుంచి)

టేబుల్ టెన్నిస్ (మ.3:35 గంటల నుంచి ) :శ్రీజ ఆకుల కాంస్య మ్యాచ్, శరత్ కమల్/సత్యన్ జ్ఞానశేఖరన్ గోల్డ్ మ్యాచ్ (సా.6.15 గంటలకు), శరత్ కమల్ SF (రాత్రి 9.50), సత్యన్ జ్ఞానశేఖరన్ సింగిల్స్ (రా.10.40 గంటలకు), శరత్ కమల్/శ్రీజ ఆకుల (మ.12.15 గంటలకు)

క్రికెట్ (రా.9:30 గంటలకు): భారత్ vs ఆస్ట్రేలియా, ఫైనల్

స్క్వాష్ (రా.10:30 గంటలకు): దీపికా పల్లికల్/సౌరవ్ ఘోషల్ కాంస్య మ్యాచ్

రెజ్లింగ్‌లో పతకాల పంట: కామన్‌వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. శనివారం కూడా రెజ్లింగ్‌లో భారత రెజ్లర్లు పతకాల పంట పండించారు. ఇప్పటికే ముగ్గురు భారత రెజ్లర్లు బజరంగ్​ పునియా, దీపక్​ పునియా, సాక్షి మాలిక్​ గోల్డ్​ మెడల్స్​ సాధించగా.. శనివారం భారత్‌కు మరో నాలుగు స్వర్ణాలు దక్కాయి. పురుషుల ఫ్రీస్టైల్​ 57 కేజీల విభాగంలో రవి దహియా, 74 కిలోల విభాగంలో నవీన్​ బంగారు పతకం సాధించారు. ఫైనల్లో నైజీరియాకు చెందిన వెల్సన్‌పై రవి దహియా 10-0 తేడాతో టెక్నికల్​ సుపిరియారిటీ కింద విజేతగా నిలిచాడు. రవి దహియా 3 సార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ రజత పతకం సాధించాడు. ఆడిన తొలిసారే కామన్‌వెల్త్​ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

మెరిసిన నవీన్, వినేశ్ ఫొగాట్: మరోవైపు నవీన్​ పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్​ తాహిర్‌పై 9-0 తేడాతో గెలిచి మరో స్వర్ణాన్ని భారత్‌ ఖాతాలో జమచేశాడు . మహిళల రెజ్లింగ్‌లో కూడా భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. 53 కేజీల విభాగం ఫైనల్‌లో వినేశ్​ ఫొగాట్​ గెలుపొందింది. శ్రీలంక రెజ్లర్‌ మదురవలగే డాన్‌ను చిత్తుగా ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. వినేష్ ఫొగాట్‌కు ఇది కామన్‌వెల్త్‌ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. వరుసగా మూడు కామన్‌వెల్త్ స్వర్ణాలు సాధించిన తొలి భారత మహిళగా వినేశ్ రికార్డు సృష్టించింది. అంతకు ముందు ఆసియా క్రీడల్లో ఆమె బంగారు పతకం గెలుచుకుంది.

IND Vs WI: నాలుగో టీ20లోనూ అదరగొట్టిన టీమిండియా.. సిరీస్ కైవసం

పూజ గెహ్లోత్‌ (50 కేజీలు), పూజ సిహాగ్‌ (76), దీపక్‌ నెహ్రా (97) కాంస్యాలు దక్కించుకున్నారు. కంచు పతక పోరులో పూజ గెహ్లోత్‌ 12-2తో లెచిజియో (స్కాట్లాండ్‌)పై, పూజ సిహాగ్‌ 11-1తో డిబ్రూయిన్‌ (ఆస్ట్రేలియా)పై, దీపక్‌ నెహ్రా 10-2తో తయాబ్‌ రజా (పాకిస్థాన్‌)పై నెగ్గారు. గత కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన తెలంగాణ బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌ మరోసారి కంచుతోనే సంతృప్తి పడ్డాడు. పురుషుల 54-57 కేజీల సెమీఫైనల్లో హుసాముద్దీన్‌ 1-4తో జోసెఫ్‌ కామె (ఘనా) చేతిలో ఓడిపోయాడు. భారత బాక్సర్లు జైస్మిన్ లంబోరియా, రోహిత్ టోకాస్ కూడా కాంస్యంతోనే ముగించారు. సీడబ్ల్యూజీలో పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సాబ్లే చారిత్రాత్మక రజత పతకాన్ని గెలుచుకోగా, 10 కిమీ రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి కూడా రజతం గెలుచుకుంది.

బాక్సర్లు నీతు ఘంఘాస్, అమిత్ పంగల్, నిఖత్ జరీన్‌ సాగర్ తమ బౌట్‌లలో విజయం సాధించి.. వారి వారి విభాగాల్లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. బ్యాడ్మింటన్‌లో స్టార్ షట్లర్ పివి సింధు, లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్‌లు తమ సింగిల్స్ సెమీ ఫైనల్‌కు చేరుకోగా, ఆకర్షి కశ్యప్ క్వార్టర్స్‌లోనే పరాజయం పాలయ్యారు. శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ సింగిల్స్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శరత్ కమల్ కూడా శ్రీజ ఆకులతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్ కార్తీక్, సౌరవ్ ఘోషల్‌ల స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ ద్వయం సెమీ-ఫైనల్‌లో విజయం సాధించడంలో విఫలమైనప్పటికీ ఆదివారం కాంస్య పతకం కోసం ఆడనున్నారు.

Exit mobile version