Site icon NTV Telugu

IND vs ZIM: జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌.. గట్టిగా కొడితేనే గట్టెక్కేది, భారత్ తుది జట్టు ఇదే!

India Playing 11 Vs Zimbabwe

India Playing 11 Vs Zimbabwe

IND vs ZIM Super 8 Playing XI in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8లో భాగంగా నేడు భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్‌ మైదానంలో మ్యాచ్ ఈరోజు రాత్రి 7 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. దక్షిణాఫ్రికాపై ఓడిపోవడంతో నెట్‌ రన్‌రేట్‌లో బాగా వెనుకబడ్డ భారత్.. గట్టిగా కొడితేనే గట్టెక్కుతుంది. ఒకవేళ జింబాబ్వేపై నేడు ఓడితే సూర్య సేన ఇంటికి వచ్చేయాల్సిందే. ఈ నేపథ్యంలో సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే.. జింబాబ్వేపై గెలవడం కాదు, భారీ తేడాతో గెలవాలి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్ ఎలా ఆడుతుందో చూడాలి.

ప్లేయింగ్ 11పై ఆసక్తి:
జింబాబ్వే మ్యాచ్ నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ 11పై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత టీమిండియా పరిస్థితికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాప్‌ ఆర్డర్‌లో అభిషేక్‌ శర్మ వైఫల్యం కలవరపెడుతోంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 15 పరుగులు చేయగా.. మూడు డకౌట్లు అయ్యాడు. ఇప్పటికైనా అభిషేక్‌ పుంజుకోవడం జట్టుకు కీలకం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అతడు సహజ శైలిలో ఆడతాడా లేదా అన్నది ఆసక్తికరం. మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ గత రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించి.. కిషన్‌ను మూడులో అందించాలని భారత్ చూస్తోంది. తిలక్‌ వర్మ స్ట్రైక్‌రేట్‌ జట్టుకు ఇబ్బందిగా మారింది. సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య పెద్ద ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నారు.

రింకూ ఆడుతాడో లేదో:
శివమ్‌ దూబె నుంచి మరో మంచి ఇన్నింగ్స్‌ టీమ్ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. జింబాబ్వేపై హిట్టర్ రింకూ సింగ్ ఆడుతాడో లేదో ఇంకా తెలియరాలేదు. సంజు శాంసన్ తుది జట్టులో ఉంటే.. రింకూ లేదా తిలక్‌ వర్మలలో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ ఆడడం ఖాయమే. ఇక బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అతడితో పాటు అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ రాణించాల్సిందే. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ల స్పిన్ బౌలింగ్‌ దాడిని తట్టుకుని నిలవడం జింబాబ్వేకు పెద్ద సవాలే. గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలకు షాకిచ్చిన జింబాబ్వేను తక్కువగా అంచనా వేయడనికి వీల్లేదు.

బిన్నంగా చెపాక్‌:
చెపాక్‌ మైదానం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలం. ఈ ప్రపంచకప్‌లో మాత్రం అందుకు బిన్నంగా ఉంది. స్పిన్నర్లకు పెద్దగా కలిసి రాకపోగా.. పేసర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అఫ్గానిస్థాన్‌పై 183 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 17.5 ఓవర్లలో ఛేదించింది. నేటి మ్యాచ్‌లో కూడా పిచ్‌ బ్యాటర్లకు సహకరించే అవకాశముంది. ఇక మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. టీ20 ప్రపంచకప్‌లో భారత్, జింబాబ్వే ఒకే ఒక్కసారి తలపడ్డాయి. 2022లో భారత్‌ 71 పరుగుల తేడాతో గెలిచింది. భారత గడ్డపై టీమిండియాతో టీ20 మ్యాచ్‌ ఆడడం జింబాబ్వేకు ఇదే మొదటిసారి.

తుది జట్లు (అంచనా):
భారత్‌: అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌ వర్మ, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్‌ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే: మరుమాని, బెనెట్, మయర్స్, ర్యాన్‌ బర్ల్, సికందర్‌ రజా, మున్యోంగా, ముసెకివా, ఎవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎంగరవ.

 

Exit mobile version