India NRR scenario vs Zimbabwe in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత్కు జింబాబ్వేతో మ్యాచ్ కీలకంగా మారింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే.. జింబాబ్వేపై కేవలం విజయం సరిపోదు, భారీ తేడాతో గెలవాలి. ముఖ్యంగా నెట్ రన్రేట్ లెక్కలు ఇప్పుడు టీమిండియాకు అత్యంత కీలకం అయ్యాయి. మ్యాచ్ ఫలితంతో పాటు స్కోర్ మార్జిన్ కూడా నిర్ణయాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ ఆశలకు జింబాబ్వేపై నెట్ రన్రేట్ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
జింబాబ్వేపై భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే.. కనీసం 0.01 నెట్ రన్రేట్ సాధించాలంటే 77 పరుగుల తేడాతో గెలవాలి. అంటే భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయాల్సిందే. చిన్న తేడాతో గెలిస్తే నెట్ రన్రేట్ ఏమాత్రం మెరుగుపడదు. తద్వారా టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.
మరోవైపు భారత్ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. లక్ష్యాన్ని ఎన్ని తక్కువ బంతుల్లో చేధిస్తే అంత ఉపయోగకరం. ఉదాహరణకు 101 పరుగుల లక్ష్యాన్ని 7.1 ఓవర్లలో, 121 లక్ష్యాన్ని 8.4 ఓవర్లలో, 141 లక్ష్యాన్ని 10 ఓవర్లలో, 161 లక్ష్యాన్ని 11.3 ఓవర్లలో, 181 లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో పూర్తి చేస్తేనే.. నెట్ రన్రేట్ 0.01కు చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్రేట్ -3.800గా ఉంది. గ్రూప్-1లో ఉన్న వెస్టిండీస్ రన్రేట్ 5.350గా ఉండగా.. దక్షిణాఫ్రికాది 3.800గా ఉంది. ఈ రెండు జట్ల రన్రేట్ దాటాలంటే.. భారత్ ఎంతటి భారీ విజయం నమోదు చేయాలో ఓసారి ఊహించుకోండి.
ఈ నెట్ రన్రేట్ సమీకరణ లెక్కలు చూస్తే.. జింబాబ్వేతో మ్యాచ్ టీమిండియాకు ఎంత కీలకమో స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి భారత్కు ఇది నిజంగా ‘డూ ఆర్ డై’ పోరు. బ్యాటర్లు భారీ స్కోరు చేయడం, బౌలర్లు ప్రత్యర్థిని త్వరగా ఔట్ చేయడం.. ఈ రెండూ జరిగితేనే సూర్య సేన సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. చూడాలి మరి మన బ్యాటర్లు, బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తారో.
