India Playing XI vs Zimbabwe 3rd T20: జింబాబ్వేతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఆదివారం (జులై 26) జరగనున్న మూడో టీ20లో కూడా గెలిచి క్లీన్స్వీప్ చేయాలి చూస్తోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే.. భారత్ 2010 తర్వాత తొలిసారి జింబాబ్వేపై ద్వైపాక్షిక టీ20 సిరీస్ను వైట్వాష్ చేసిన జట్టుగా నిలుస్తుంది. సిరీస్ ఇప్పటికే ఖాయం కావడంతో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది.
కోలుకున్న శ్రేయస్ సేన:
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుసగా ఆరు పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. జింబాబ్వే సిరీస్లో వరుసగా రెండు విజయాలు సాధించి విమర్శలకు చెక్ పెట్టాడు. తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకున్న అయ్యర్కు ఇప్పుడు క్లీన్స్వీప్తో మరో ఘనత సాధించే అవకాశం వచ్చింది. ఇప్పుడు జట్టు విజయాలు అందుకుని మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.
మారనున్న ప్లేయింగ్ ఎలెవన్:
రెండో టీ20లో అద్భుతంగా బౌలింగ్ చేసిన యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు మూడో మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో కొన్ని మార్పులు ఉండొచ్చని సంకేతాలు ఇచ్చాడు. ప్రిన్స్ స్థానంలో తొలి టీ20 ఆడిన పేసర్ అశోక్ శర్మ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని పంజాబ్ వికెట్కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్కు అవకాశం లభించే అవకాశముంది. మరోవైపు వన్డేల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన సూర్యాంశ్ షెడ్గే కూడా తొలి టీ20 క్యాప్ కోసం ఎదురుచూస్తున్నాడు.
యువ ఆటగాళ్లపై అందరి దృష్టి:
ఈ సిరీస్లో టీమిండియాకు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ మళ్లీ ఫామ్లోకి రావడం, తిలక్ వర్మ నిలకడగా పరుగులు చేయడం, వైభవ్ సూర్యవంశీ రికార్డు హాఫ్ సెంచరీతో మెరవడం జట్టుకు భారీ ప్లస్గా మారాయి. అభిషేక్ శర్మ బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా.. రెండో మ్యాచ్లో మూడు వికెట్లు తీసి తన ఆల్రౌండ్ విలువను నిరూపించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పరుగులు చేయడమే కాకుండా.. తన కెప్టెన్సీ మార్క్ చూపిస్తున్నాడు.
పరువు నిలబెట్టుకోవాలని జింబాబ్వే:
ఇప్పటికే సిరీస్ కోల్పోయిన జింబాబ్వే.. కనీసం చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. బ్రియాన్ బెన్నెట్ మంచి ఫామ్లో ఉన్నప్పటికీ.. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివరి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసి అభిమానులకు ఓ విజయాన్ని అందించాలని ఆతిథ్య జట్టు ఆశిస్తోంది.
హరారే పిచ్, వాతావరణం:
హరారే పిచ్ ఈ సిరీస్ మొత్తం బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. క్రీజులో కుదురుకున్న బ్యాటర్లకు భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో సద్వినియోగం చేసుకుంది. మూడో టీ20లో కూడా మరో హై స్కోరింగ్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం కూడా మ్యాచ్కు పూర్తిగా అనుకూలంగా ఉండనుంది. వర్షం పడే అవకాశం లేకపోవడంతో ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 21-22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనున్నాయి. యునైట్8 స్పోర్ట్స్ ఛానెల్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. అలానే ఫ్యాన్ కోడ్లో లైవ్ మ్యాచ్ స్ట్రీమింగ్ కానుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
జింబాబ్వే, భారత్ మధ్య ఇప్పటివరకు మొత్తం 16 టీ20 మ్యాచ్లు జరిగాయి. భారత్ విజయాలు 13 విజయాలు అందుకోగా.. జింబాబ్వే మూడు విజయాలు అందుకుంది. జింబాబ్వేలో భారత్ 14 మ్యాచ్లు ఆడింది. ఇందులో భారత్ 11 విజయాలు సాధించగా.. జింబాబ్వే 3 విజయాలు నమోదు చేసింది.
తుది జట్లు (అంచనా):
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్/ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే/సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.
జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కరన్, డియాన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మధేవెరే, తడివానాషే మరుమాని, బ్రాడ్ ఎవాన్స్, న్యూమన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవా, బ్లెసింగ్ ముజరబాని.

