IND vs ENG 5th T20: ‘వైట్‌వాష్’ ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!

  • వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిలో భారత్
  • ఐదో టీ20లో పరువు నిలబెట్టుకోవాలని చూస్తోన్న భారత్
  • తొలి విజయం కోసం ఎదురుచూపులు
India Whitewash Threat

India Whitewash Threat

India whitewash Threat: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన భారత్.. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగే ఐదో టీ20లో పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో ఇంగ్లండ్ 3-0తో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లో కూడా ఓడితే భారత్ 4-0తో వైట్‌వాష్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది.

తొలి విజయం కోసం ఎదురుచూపులు:
టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత భారత జట్టు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఇప్పటివరకు విజయమే లేదు. బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్ సిరీస్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణం.. ఇంగ్లండ్ పర్యటనలోనూ నిరాశాజనకంగానే కొనసాగుతోంది. కెప్టెన్‌గా శ్రేయస్ వరుసగా పరాజయాలు భారత టీ20 చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ విజయరహిత పరంపరగా నిలిచింది. అందుకే కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఆ నిరాశకు తెరదించాలని శ్రేయస్ భావిస్తున్నాడు.

బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం:
ఈ సిరీస్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. ముఖ్యంగా మూడో టీ20లో కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌ల వేగానికి భారత బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. అలాగే సామ్ కరన్ స్లో బంతులను కూడా మనోళ్లు సరిగా ఎదుర్కోలేకపోయారు.

జట్టులో మార్పులపై ఆసక్తి:
చివరి మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. హామ్‌స్ట్రింగ్ గాయాలతో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఇప్పటికే దూరమయ్యారు. మరోవైపు రవి బిష్ణోయ్ కూడా వరుసగా విఫలమవుతుండటంతో అతని స్థానంపై సందేహాలు నెలకొన్నాయి. బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్న తిలక్ వర్మ స్థానంలో సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సంజును జట్టులోకి తీసుకోవాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా షార్ట్‌పిచ్ బంతులకు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం:
ఇంగ్లండ్ మాత్రం ఈ సిరీస్‌లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్, జాకబ్ బెతెల్ బ్యాటింగ్‌లో అదరగొడుతుండగా.. విల్ జాక్స్, ఆదిల్ రషీద్, లియామ్ డాసన్ స్పిన్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. పేస్, స్పిన్‌ల సమన్వయంతో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. సిరీస్ ఇప్పటికే చేజారిపోయినప్పటికీ.. చివరి టీ20లో గెలిచి కనీసం 1-3తో ముగిస్తే భారత్‌కు కొంత ఊరట లభిస్తుంది. అయితే మరోసారి ఓడిపోతే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం. ప్రస్తుతం భారత్ దిక్కుతోచని స్థితిలో ఉంది.