IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!

  • భారత్, ఇంగ్లండ్ మధ్య చివరి వన్డే మ్యాచ్‌
  • ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోన్న భారత్
  • భారత్‌కు అచ్చిరాని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్
  • లార్డ్స్ మైదానంలో రోహిత్ చెత్త రికార్డు
Rohit Sharma Retirement Buzz

Rohit Sharma Retirement Buzz

Rohit Sharma Poor ODI Record at Lord’s: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య చివరి మ్యాచ్‌ జరగనుంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఈ సిరీస్ డిసైడర్‌కు వేదిక. తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఇరు జట్లకు మూడో వన్డే మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే.. ఇరు జట్లకు లార్డ్స్‌లో విజయం తప్పనిసరి. ముఖ్యంగా టీ20 సిరీస్ 4-0తో కోల్పోయిన టీమిండియా ఈ వన్డేలో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

భారత్‌కు అచ్చిరాని లార్డ్స్:

అయితే క్రికెట్‌కు మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానం వన్డేల్లో భారత్‌కు అంతగా కలిసి రాలేదు. ఇప్పటివరకు ఈ వేదికపై టీమిండియా మొత్తం 9 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా.. మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ గణాంకాలు చూస్తే.. లార్డ్స్‌ మైదానం భారత్‌కు అచ్చిరాలేదని స్పష్టమవుతోంది. అయినప్పటికీ ఈసారి ఆ ప్రతికూల రికార్డును మార్చి.. సిరీస్‌ను గెలవాలనే లక్ష్యంతో శుభ్‌మన్ గిల్ సేన బరిలోకి దిగుతోంది.

లార్డ్స్ మైదానంలో రోహిత్ చెత్త రికార్డు:

మరోవైపు రోహిత్ శర్మకు వన్డేల్లో లార్డ్స్ మైదానంలో చెత్త రికార్డు ఉంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లలో 15 రన్స్ మాత్రమే చేశాడు. ఒక మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అత్యుత్తమ వన్డే ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన రోహిత్‌కు లార్డ్స్ మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఇంగ్లండ్‌లోని ఇతర మైదానాల్లో పరుగుల వరద పారించిన హిట్‌మ్యాన్.. లార్డ్స్‌లో మాత్రం పరుగులు చేయలేకపోతున్నాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో కూడా రోహిత్ రాణించలేదు. తొలి వన్డేలో 11 పరుగులు చేసిన రోహిత్.. రెండో మ్యాచ్‌లో 26 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో నేడు రోహిత్ ఆటపై అందరి దృష్టి నెలకొంది. హిట్‌మ్యాన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

సమష్టిగా రాణిస్తేనే విజయం:

ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత తొలి వన్డేలో విజయం సాధించి భారత్ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందింది. అయితే కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ వైఫల్యం జట్టును దెబ్బతీసింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అర్ధశతకాలతో రాణించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు తేలిపోవడంతో భారత్ 233 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేలో బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణిస్తేనే భారత్ సిరీస్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.