India Playing XI vs vs England 3rd ODI: ఇంగ్లండ్ గడ్డపై భారత్ పర్యటన చివరి దశకు చేరుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా చివరిదైన మూడో ఆదివారం జరగనుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో జులై 19న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న మూడో వన్డే సిరీస్ విజేతను తేల్చనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. జియోహాట్స్టార్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్లో లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్ కాబోతోందనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో.. అందరి దృష్టి ఈ మ్యాచ్పైనే ఉంది. బీసీసీఐ కార్యదర్శి ఈ వార్తలను ఖండించినప్పటికీ.. ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. మ్యాచ్ ముగిసాక కానీ హిట్మ్యాన్ అభిమానులకు ఊరట దక్కేలా లేదు. మొదటి రెండు మ్యాచ్లలో నిరాశపర్చిన రోహిత్.. సిరీస్ డిసైడర్ మ్యాచ్లో అయినా చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి హిట్మ్యాన్ ఓపెనింగ్ చేయనున్నాడు.
ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. కింగ్ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడితే భారత్ భారీ స్కోర్ చేస్తుంది. నాలుగో స్థానంలో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లో ఉన్నాడు. అనారోగ్యానికి గురవడంతో కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో కేఎల్ రాహుల్ ఆడలేదు. మూడో వన్డేలో రాహుల్ బరిలోకి దిగనున్నాడు. దాంతో ఇషాన్ కిషన్ తుది జట్టు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. తొడ కండరాల గాయంతో వాషింగ్టన్ సుందర్ మూడో వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే మాత్రం ఇషాన్ కూడా జట్టులో కొనసాగుతాడు.
అక్షర్ పటేల్, శివమ్ దూబేలు లోయరార్డర్లో ఆడనున్నారు. ఈ ఇద్దరు ఇప్పటివరకు సిరీస్లో పెద్దగా రాణించలేదు. కాబట్టి సిరీస్ డిసైడర్ మ్యాచ్లో అయినా రాణించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. లార్డ్స్ పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పేసర్లకు ఇక్కడ స్వింగ్, బౌన్స్ లభిస్తాయి. జస్ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణలు పేస్ కోటాలో ఆడుతారు. గుర్నూర్ ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు కాబట్టి అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ల్లో ఒకర్ని ఆడించే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్ తుది జట్టులో ఎవరిని ఎంపిక చేస్తారో.
టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా):
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్/ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా.

