Harry Brook About IPL Ban: ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడడంపై తొలిసారి స్పందించాడు. 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సీజన్లో అభిమానుల నుంచి ఎదురైన విమర్శలు తనపై మానసికంగా, వ్యక్తిగతంగా తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడించాడు. ఆ సమయంలో సోషల్ మీడియా, విమర్శలపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మైదానంలో ప్రదర్శనపై ప్రభావం పడడమే కాక.. బయట మానసిక ప్రశాంతత కరువైందని చెప్పాడు. 2023 ఐపీఎల్ వల్ల తాను ఓ సమయంలో డిప్రెషన్లోకి వెళిపోయా అని ఇంగ్లండ్ స్టార్ బ్రూక్ చెప్పుకొచ్చాడు.
అభిమానుల భారీ అంచనాలు:
హ్యారీ బ్రూక్ 2023 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాడు. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బ్రూక్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే 11 మ్యాచ్ల్లో బ్రూక్ 190 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ సగటు 21.11గా ఉండగా.. స్ట్రైక్రేట్ 123.37గా నమోదైంది. కోల్కతా నైట్ రైడర్స్పై సెంచరీ చేయడం ఆ సీజన్లో హైలైట్గా నిలిచింది. ఇటీవల బీబీసీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రూక్ ఆ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు.
నాపై ప్రభావం చూపాయి:
అభిమానుల విమర్శలు, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను పట్టించుకోకుండా ఉండటం తనకు చాలా కష్టంగా మారిందని హ్యారీ బ్రూక్ చెప్పాడు. ‘ఐపీఎల్ 2023లో ఆడినపుడు విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో కామెంట్స్ చూసి కుంగిపోయాను. అది మైదానంలోనూ, బయటా వ్యక్తిగతంగా నాపై ప్రభావం చూపాయి. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకోలేదు కానీ.. ఆ సమయంలో విమర్శలు చదవడం మానేశా. విమర్శలను పూర్తిగా పట్టించుకోకుండా ఉండటం కష్టమే అయినప్పటికీ.. వాటిని నా ఆటపై ప్రభావం చూపకుండా చూసేందుకు ప్రయత్నించా’ అని చెప్పాడు.
మరో కోణం కూడా:
విమర్శల్లో మరో కోణం కూడా ఉందని హ్యారీ బ్రూక్ అభిప్రాయపడ్డాడు. ‘నాపై అభిమానులు ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం ఒక రకంగా అభినందనే. నా ఆటపై ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంటే.. నేను ఇంకా మెరుగ్గా ఆడగలనని వారు నమ్ముతున్నారు. అయితే నన్ను తీవ్రంగా విమర్శించడంను జీర్ణించుకోలేకపోయా’ అని తెలిపాడు. 2025 సీజన్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ బ్రూక్ను కొనసాగించింది. అయితే కుటుంబ కారణాలతో అతడు ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2025 సీజన్లో ఆడేందుకు సిద్ధమైనప్పటికీ.. టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇస్తూ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.
బ్రూక్పై రెండేళ్ల నిషేధం:
రెండు సీజన్లలో ఐపీఎల్ నుంచి చివరి నిమిషంలో తప్పుకోవడంతో హ్యారీ బ్రూక్పై ఐపీఎల్ పాలక మండలి రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో అతడు 2027 ఐపీఎల్ వరకు ఆడే ఛాన్స్ లేదు. 2028 ఐపీఎల్ మెగా వేలంలోనే తిరిగి తన పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఐపీఎల్ నుంచి వైదొలిగిన నిర్ణయంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని బ్రూక్ స్పష్టం చేశాడు. తన తొలి ఐపీఎల్ సవ్యంగా సాగకున్నా.. విమర్శలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని బ్రూక్ చెప్పుకొచ్చాడు.

