FIFA: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసిన ఫిఫా.. ఎందుకో తెలుసా?

Fifa

Fifa

FIFA: పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని(థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యం ఉందని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేసింది. అనవసరమైన ప్రభావం ఉన్నందున తక్షణమే అమలులోకి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. “ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిన థర్డ్ పార్టీల నుండి అనవసర ప్రభావం కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది” అని ఫిఫా(FIFA) ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) తన రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను తిరిగి పొందే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

సస్పెన్షన్‌ కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌ 11-30 తేదీల్లో భారత్‌లో జరగాల్సిన FIFA U-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది. భారత్‌ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నమెంట్‌కు సంబంధించి తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని, అవసరమైతే, కౌన్సిల్ బ్యూరోకు రిఫర్ చేస్తామని ఫిఫా తెలిపింది. ఈ మేరకు భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖతో నిరంతరం నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించి సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఫిపా పాలకమండలి తెలిపింది.

Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!

మరోవైపు భారత ఫుట్‌బాలర్లంతా ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్‌ స్ట్రయికర్‌ సునీల్‌ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇది మన చేతులు దాటిపోయిందని ఛెత్రి అన్నాడు. అఖిల భారత ఫుట్‌బాల్‌ సంఘం (ఏఐఎఫ్‌ఎఫ్‌) చాలాకాలంగా అడ్‌హక్‌ కమిటీతో నడుస్తోంది.