దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్తో అదరగొట్టాడు. చెన్నైలో సౌత్ జోన్తో జరుగుతున్న ఫైనల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కిషన్.. 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు చేశాడు. అతడి భారీ ఇన్నింగ్స్తో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ డబుల్ సెంచరీతో దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన మూడో బ్యాటర్గా ఇషాన్ నిలిచాడు.
ఇంతకుముందు అరుణ్ లాల్, సబా కరీమ్ మాత్రమే ఈస్ట్ జోన్ తరఫున డబుల్ సెంచరీ చేశారు. 1986లో వెస్ట్ జోన్పై అరుణ్ లాల్ 287 పరుగులు చేయగా.. అదే ఏడాది సెంట్రల్ జోన్పై 214 పరుగులు కూడా చేశాడు. 1995లో వెస్ట్ జోన్పై సబా కరీమ్ అజేయంగా 200 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ సాధించిన ఏడో బ్యాటర్గా కూడా ఇషాన్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఈస్ట్ జోన్కు కెప్టెన్గా, వికెట్ కీపర్గా వ్యవహరిస్తూ.. ఫైనల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్ అద్భుత బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ను యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రారంభించాడు. 37 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ సందర్భంగా కామెంట్రీలో ఉన్న మాజీ భారత క్రికెటర్ వివేక్ రజ్దాన్.. వైభవ్కు కీలక సూచన చేశాడు. ఇషాన్ కిషన్ నుంచి వైభవ్ నేర్చుకోవాల్సిన విషయం ఉందని పేర్కొన్నాడు. ముఖ్యంగా క్రీజులో ఒకసారి కుదురుకున్న తర్వాత సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఎలా ఆడాలో నేర్చుకోవాలని సూచించాడు. ‘సూర్యవంశీ సాహెబ్.. ఇప్పుడు నువ్ ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్ల నుంచి నేర్చుకోవాలి. ఒకసారి క్రీజులో సెటిల్ అయిన తర్వాత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో నేర్చుకోవాలి’ అని వివేక్ కామెంట్రీలో చెప్పాడు.
ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను వివేక్ రజ్దాన్ ప్రశంసించాడు. సుదీర్ఘంగా క్రీజులో నిలబడి, ఇలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడటం కేవలం టెక్నిక్, టెంపర్మెంట్తోనే సాధ్యం కాదని.. అందుకు మ్యాచ్ ఫిట్నెస్ కూడా అవసరమని పేర్కొన్నాడు. ఇషాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడంటూ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ రెండో రోజు ఇషాన్, కుషాగ్ర తమ తొలి రోజు ఆటను కొనసాగించారు. ఐదో వికెట్కు వీరిద్దరూ ఏకంగా 230 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజు 385/4తో ముగించిన ఈస్ట్ జోన్ మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం సాధించింది. కుషాగ్ర 128 బంతుల్లో తన తొలి దులీప్ ట్రోఫీ సెంచరీ పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ చేసిన కొద్దిసేపటికే విజయ్ బౌలింగ్లో డీప్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొత్తం 132 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
కుషాగ్ర ఔటైన తర్వాత కూడా ఇషాన్ కిషన్ దూకుడు కొనసాగించాడు. అనుకూల్ రాయ్తో కలిసి ఈస్ట్ జోన్ స్కోరును 500, ఆ తర్వాత 550 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో కిషన్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అనంతరం 250 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అప్పటికి ఈస్ట్ జోన్ స్కోరు 611/5గా ఉంది. అనుకూల్ రాయ్ 45 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మహ్మద్ షమీ 28 పరుగులు చేశాడు. చివరి సెషన్లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా సాగింది. చివరకు 163 ఓవర్లలో 708 పరుగులకు ఆలౌటైంది.

