Duleep Trophy Final: ఈస్ట్‌ జోన్‌ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్‌ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్‌ రూల్‌ ఇదే!

Duleep Trophy Final 2026

Duleep Trophy Final 2026

Duleep Trophy 2026 Final: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్‌ జోన్‌ బ్యాటింగ్‌ వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్‌ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా స్టార్ ఇషాన్‌ కిషన్‌ డబుల్‌ సెంచరీ (270), కుమార్‌ కుశాగ్ర (101) శతకంతో చెలరేగడంతో ఈస్ట్‌ జోన్‌ ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే.. రెండు రోజుల పాటు ఈస్ట్‌ జోన్‌ బ్యాటింగ్‌ చేయడమే.

ఐదు రోజుల మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన తర్వాత కూడా ఈస్ట్‌ జోన్‌ డిక్లేర్‌ చేయకుండా బ్యాటింగ్‌ను కొనసాగించడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. 700 పరుగుల మార్క్‌ను దాటిన తర్వాత కూడా బ్యాటర్లు క్రీజులోనే ఉండటంతో.. మ్యాచ్‌లో మిగిలిన సమయంలో సౌత్‌ జోన్‌ 20 వికెట్లు పడగొట్టేందుకు ఈ వ్యూహం సరిపోతుందా? అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే ఈస్ట్‌ జోన్‌ తీసుకున్న నిర్ణయం టోర్నీ నిబంధనలకు అనుగుణంగానే ఉంది. బీసీసీఐ రెడ్‌బాల్‌ నాకౌట్‌ మ్యాచ్‌లకు వర్తించే ప్లేయింగ్‌ కండిషన్స్‌ ప్రకారం.. దులీప్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీ ఫైనల్‌ వంటి ఐదు రోజుల మ్యాచ్‌లు డ్రాగా ముగిస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారు.

ఈ నిబంధన నేపథ్యంలోనే ఈస్ట్‌ జోన్‌ 708 పరుగుల భారీ స్కోరు సాధించడం కీలకంగా మారింది. ఇప్పుడు సౌత్‌ జోన్‌ కనీసం 709 పరుగులు చేయాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు వెనుకబడినా.. మ్యాచ్‌ డ్రాగా ముగిసిన సందర్భంలో ఈస్ట్‌ జోన్‌కే విజయం సొంతమవుతుంది. అంటే 708 పరుగుల స్కోరు ఈస్ట్‌ జోన్‌కు పెద్ద ప్లస్ గా మారింది. మ్యాచ్‌ చివరి వరకు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయలేకపోయినా.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం టైటిల్‌ను అందించే అవకాశం ఉంది.

ఈస్ట్‌ జోన్‌ భారీ స్కోరులో ప్రధాన ఆకర్షణ ఇషాన్‌ కిషన్‌. అతడు ఏకంగా 270 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. సుదీర్ఘంగా క్రీజులో నిలిచిన కిషన్‌ తన రెడ్‌బాల్‌ క్రికెట్‌ సామర్థ్యాన్ని మరోసారి చాటుకున్నాడు. భారత జట్టులో చోటు కోల్పోయిన తర్వాత తనపై ఉన్న అంచనాలు, బయట నుంచి వచ్చే ఒత్తిడిని పక్కనపెట్టి.. కేవలం పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టడం తన ఆటలో మార్పుకు కారణమైందని కిషన్‌ చెప్పాడు. తన మైండ్‌సెట్‌ గురించి మాట్లాడిన కిషన్‌.. తనను తాను మార్చుకోవాలని ప్రత్యేకంగా ప్రయత్నించలేదని, అది సహజంగానే జరిగిందని తెలిపాడు. భారత జట్టుకు దూరమైన సమయంలో కెరీర్‌లో చివరకు చేయాల్సిన పని ఒక్కటేనని.. పరుగులు చేయడమే తమ బాధ్యత అని అర్థం చేసుకున్నట్లు చెప్పాడు. కాలంతో పాటు ఆటగాడిలో మార్పు సహజంగా వస్తుందని అభిప్రాయపడ్డాడు. మైండ్‌ను క్లియర్‌గా ఉంచుకుని ఆటపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు బ్యాటింగ్‌ చేయడం చాలా సులభంగా అనిపిస్తుందని ఇషాన్ చెప్పాడు.