IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. యోయో టెస్టులో విఫలమైన పృథ్వీ షా

ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా యోయో టెస్టులో విఫలమయ్యాడు. ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతో మెగా టోర్నీకి అతడు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. యోయో టెస్టులో ప్రతి ఆటగాడు కనీసం 16.5 స్కోరు సాధించాల్సి ఉంది. ఈ స్కోరు సాధించకపోతే ఐపీఎల్‌లోకి నిర్వాహకులు అనుమతించరు.

ఇదే యోయో టెస్టులో ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా పాస్ మార్కులతో బయటపడినట్లు తెలుస్తోంది. హార్డిక్ 17కు పైగా స్కోర్ సాధించాడని సమాచారం అందుతోంది. బీసీసీఐ కాంట్రాక్ట్, నాన్ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు ఇటీవలే ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బీసీసీఐ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లలో పృథ్వీ షా లేకపోవడంతో అతడు ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఒకవేళ బీసీసీఐ పృథ్వీషాకు ఆడే అనుమతి ఇస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌కు అది శుభవార్త కిందే పరిగణించాలి.