Ben Stokes Is Set to Meet Advisor Neil Fairbrother: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. న్యూజిలాండ్తో తొలి టెస్ట్ అనంతరం జరిగిన నైట్క్లబ్ వివాదం తర్వాత అతడి కెరీర్పై సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్ బుధవారం తన సలహాదారులతో సమావేశమై.. భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలా? లేదా క్షమాపణలు చెప్పి కెప్టెన్గా కొనసాగాలా? అనే అంశాలపై స్టోక్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
విచారణ చేపట్టిన ఈసీబీ:
న్యూజిలాండ్తో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత బెన్ స్టోక్స్, ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ లండన్లోని ఓ నైట్క్లబ్కు వెళ్లారు. దాంతో ఇద్దరు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జట్టు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. నైట్క్లబ్లో జరిగిన ఘర్షణలో సారాసెన్స్ రగ్బీ ఆటగాడు టోటోవా ఔవా కూడా ఉన్నాడు. ఈ ఘటనలో ఇంగ్లండ్ భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలై కుట్లు పడ్డాయి. దీంతో ఈసీబీ, క్రికెట్ రెగ్యులేటర్ సంయుక్తంగా విచారణ చేపట్టాయి. ఈ ఘటన నేపథ్యంలో ఈసీబీ అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
నీల్ ఫెయిర్ బ్రదర్తో సమావేశం:
బెన్ స్టోక్స్పై జరిమానా, సస్పెన్షన్ వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలను ఈసీబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడిని తీవ్ర ఒత్తిడికి గురిచేయడం వల్ల అంతర్జాతీయ క్రికెట్కే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్న ఆందోళన కూడా బోర్డులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. స్టోక్స్ తన చిరకాల సలహాదారు, మాజీ ఇంగ్లండ్ బ్యాటర్ నీల్ ఫెయిర్ బ్రదర్తో సమావేశం కానున్నాడు. ఈ భేటీలో కెప్టెన్సీ కొనసాగించాలా, నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలా లేదా కొంతకాలం క్రికెట్కు విరామం ఇవ్వాలా అనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 2027 యాషెస్ సిరీస్ వరకు అమల్లో ఉన్న తన సెంట్రల్ కాంట్రాక్ట్ను కొనసాగించాలా అనే అంశాన్ని కూడా స్టోక్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మిగిలిన మ్యాచ్లకు దూరం:
ఇదిలా ఉండగా.. స్టోక్స్, అట్కిన్సన్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాల నేపథ్యంలో న్యూజిలాండ్తో మిగిలిన మ్యాచ్లకు ఈ ఇద్దరు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 17 నుంచి ది ఓవల్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్కు సంబంధించిన జట్టును ఈసీబీ ఈ వారంలో ప్రకటించనుంది. స్టోక్స్ ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నప్పటికీ.. ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడట . అదే సమయంలో ఈసీబీ వ్యవహరించిన తీరుపై కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నాడట. స్టోక్స్ తీసుకునే నిర్ణయం ఇంగ్లండ్ క్రికెట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

